భద్రాద్రిని విడదీస్తే ఉద్యమమే | Sakshi
Sakshi News home page

భద్రాద్రిని విడదీస్తే ఉద్యమమే

Published Sun, Oct 27 2013 7:17 AM

If 'Bhadradri' is separated another movement

జగన్నాధపురం (వాజేడు), న్యూస్‌లైన్: తెలంగాణ నుంచి భద్రాద్రిని విడదీస్తే చూస్తూ ఊరుకునేది లేదని, తీవ్ర స్థాయిలో ఉద్యమిస్తామని తెలంగాణవాదులు హెచ్చరించారు. భద్రాద్రిని తెలంగాణ నుంచి విడదీయాలన్న ప్రయత్నాలను నిరసిస్తూ జగన్నాధపురం గ్రామం వద్ద జాతీయ రహదారిపై తెలంగాణవాదులు శనివారం నాలుగు గంటలపాటు రాస్తారోకో చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు తెలంగాణవాదులు మాట్లాడుతూ.. భద్రాచలం డివిజన్‌ను సీమాంధ్రలో కలిపే ప్రయత్నాల వెనుక.. దానిపై (భద్రాచలంపై) ప్రేమనో, ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలన్న ఆలోచనో ఉందనుకుంటే పొరబడినట్టేనని అన్నారు.
 
 పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి తెలంగాణ ప్రాంతం నుంచి ఎలాంటి అడ్డంకులు రాకుండా చూసేందుకే భద్రాచలం డివిజన్‌ను సీమాంధ్రలో కలిపేందుకు అక్కడి నాయకులు, పాలకులు యత్నిస్తున్నట్టు చెప్పారు. భద్రాద్రిని సీమాంధ్రలో కలిపిన వెంటనే 1/70 చట్టాన్ని సవరిస్తారని, ఇక్కడి ఖనిజ సంపదను దోచుకుంటారని, అప్పుడు గిరిజనులకు అన్యాయం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. భద్రాచలం రాముడు తెలంగాణకే స్వంతమని అన్నారు. భద్రాచలం డివిజన్‌లోని కొందరు నాయకులు తమ స్వార్థపూరిత రాజకీయాల కోసం తప్పుడు ప్రకటనలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. తెలంగాణ నుంచి భద్రాచలాన్ని విడదీసేందుకు సాగుతు న్న యత్నాలకు వ్యతిరేకంగా డివిజన్‌లోని ప్రజలు, నాయకులు రాజకీయాల కు అతీతంగా ఉద్యమించాలని కోరారు. రాస్తారోకోలో టీజేఏసీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ జికె.శ్రీనివాస్, నాయకులు డెనార్జున రావు, దావూద్, వేణు, ఖాజావలి, సుబ్బరాజు తదితరులు పాల్గొన్నారు.
 
చర్లలో రాస్తారోకో
చర్ల: భద్రాచలం డివిజన్‌ను తెలంగాణ రాష్ట్రంలోనే కొనసాగించాలన్న డిమాండుతో రాజకీయ జేఏసీ ఆధ్వర్యంలో శనివారం స్థానిక అంబేద్కర్ సెంటర్‌లో రాస్తారోకో జరిగింది. ‘భద్రాద్రి రాముడు.. తెలంగాణ దేవుడు’, ‘భద్రాచలం డివిజన్‌ను తెలంగాణలోనే కొనసాగించాలి’ అని ఆందోళనకారులు పెద్దపెట్టున నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకుడు, కాం గ్రెస్ పార్టీ బ్లాక్ అధ్యక్షుడు నల్ల పు దుర్గాప్రసాదరావు మాట్లాడుతూ.. భద్రాచలం డివిజన్ తెలంగాణలో అంతర్భాగమేనని అన్నారు.  దీనిని లాక్కునేందుకు ఆంధ్ర ప్రాంత నాయకులు కుటిల యత్నాలు సాగిస్తున్నారని విమర్శించారు. దీనిని తిప్పికొట్టేందుకు ప్రతి ఒక్కరూ ముం దుకు రావాలని కోరారు. కార్యక్రమంలో జేఏసీ నాయకులు కారంపూడి సాల్మన్‌రాజు, కెఎస్‌కె.నాయుడు, ఎస్‌డి.అజీజ్, కుంజా శ్రీనివాసరావు, అడ్డగర్ల తాతాజీ తదితరులు పాల్గొన్నారు.
 
 

Advertisement

తప్పక చదవండి

Advertisement