Sakshi News home page

పశ్చిమ రాయలసీమ ఎమ్మెల్సీపై కన్ను

Published Fri, Apr 22 2016 3:58 AM

In a high profile campaign of candidates

పోటాపోటీగా అభ్యర్థుల ప్రచారం
పదో తరగతి స్పాట్ కేంద్రంగా రాజకీయాలు
బిజీబిజీగా ఉపాధ్యాయ సంఘాల నేతలు

 
కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు): పదో తరగతి స్పాట్ కేంద్రంగా ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థులు రాజకీయానికి తెరతీశారు. 2017 మార్చిలో జరిగే పశ్చిమ రాయలసీమ ఎమ్మెల్సీ స్థానాన్ని కైవసం చేసుకునేందుకు ఇప్పటి నుంచే పావులు కదుపుతున్నారు. ఈ నెల 9 నుంచి ప్రారంభమైన పదో తరగతి స్పాట్ వాల్యూయేషన్ కేంద్రంలో పేపర్లు దిద్దే ఉపాధ్యాయులను సమస్యల పేరుతో పలకరిస్తున్నారు. పనిలో పనిగా తమకు ఎన్నికల్లో మద్దతు ఇవ్వాలని అభ్యర్థిస్తున్నారు. ఇప్పటికే కత్తినరసింహారెడ్డి(ఎస్టీయూ), రామస్వామి(ఆర్‌జేయూపీ), ఎమ్మెల్సీ గేయానంద్(యూటీఎఫ్), మాజీ ఎమ్మెల్సీ(ఎస్టీయూ) పోచంరెడ్డి సుబ్బారెడ్డి స్పాట్ కేంద్రంలో ఉపాధ్యాయులను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు.


 ఏడాదంతే ప్రచారమే..
 పశ్చిమ రాయలసీమ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజకవర్గంలో కర్నూలు, అనంతపురం, కడప జిల్లాల ఉపాధ్యాయులకు ఓటు హక్కు ఉంటుంది. మూడు జిల్లాలు కావడంతో అభ్యర్థులు ఏడాది ముందు నుంచే ప్రచారం మొదలు పెడతారు. ఒక్కో జిల్లాలో సుమారు 15 వేల ఓట్లుంటాయి. ప్రతి ఒక్కరినీ కలుసుకునేందుకు ఆ మేరకు సమయం కావాల్సి ఉండడంతో ఇప్పటి నుంచే ప్రచారం చేస్తున్నారు.


 ప్రకటించిన అభ్యర్థులు..
 పీఆర్‌టీయూ: పశ్చిమ రాయలసీమ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్సీగా ఉన్న  బచ్చల పుల్లయ్య
ఎస్టీయూ:  సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కత్తి నరసింహారెడ్డి
ఆర్‌జేయూపీ:  2011లో స్వల్ప ఓట్ల తేడాతో ఓడిన రామస్వామి
యూటీఎఫ్: ప్రస్తుతం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా ఉన్న గేయానంద్
వైఎస్సార్‌టీఎఫ్: సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఓబులపతి అభ్యర్థిత్వం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు.
ఎస్టీయూ(రెబల్): గత ఎన్నికల్లో ఓడిపోయిన పోచంరెడ్డి సుబ్బారెడ్డి

Advertisement

What’s your opinion

Advertisement