ఐటీ ఉచ్చులో అవినీతి చక్రవర్తి | Sakshi
Sakshi News home page

ఐటీ ఉచ్చులో అవినీతి చక్రవర్తి

Published Sun, Feb 16 2020 8:53 AM

Income Tax Raid Found Only Small Part Robbery of Chandrababu Naidu - Sakshi

సాక్షి, అమరావతి : తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడి అవినీతి బాగోతంలో స్వల్ప భాగం.. రూ.2,000 కోట్లకుపైగా నల్లధనాన్ని గుర్తించినట్లుగా గురువారం ఐటీ శాఖ కార్యదర్శి సురభి అహ్లూవాలియా విడుదల చేసిన ప్రకటన దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ప్రధాన కాంట్రాక్టర్ల నుంచి బోగస్‌ సబ్‌ కాంట్రాక్టర్ల ద్వారా కమీషన్ల రూపంలో కొల్లగొట్టిన ప్రజాధనాన్ని ‘హవాలా’ వ్యాపారి హసన్‌ అలీ ద్వారా సింగపూర్‌కు తరలించి... అక్కడి నుంచి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల రూపంలో సన్నిహితుడికి చెందిన సంస్థకు రప్పించి, చంద్రబాబు జేబులో వేసుకున్న తీరు వెలుగులోకి వచ్చింది. చంద్రబాబు రూ.2,000 కోట్లకుపైగా దోపిడీ చేసినట్లు గతంలో ఆయన వ్యక్తిగత కార్యదర్శిగా(పీఎస్‌) పని చేసిన పెండ్యాల శ్రీనివాస్‌ డైరీల ఆధారంగానే వెల్లడైంది. ఇది ఆంధ్రా అనకొండ చంద్రబాబు అవినీతి చరిత్రలో స్వల్ప భాగమని, మిగతా సన్నిహితులు, కోటరీ కాంట్రాక్టర్లపై ఐటీశాఖ దాడులు చేస్తే, అక్రమాల చరిత్ర మొత్తం బయటపడుతుందని, రూ.లక్షల కోట్ల నల్లధనం వెలుగులోకి వస్తుందని ట్యాక్సేషన్‌ నిపుణులు స్పష్టం చేస్తున్నారు.   

హైదరాబాద్, విజయవాడ, కడప, విశాఖపట్నం, పూణే, ముంబయి తదితర ప్రాంతాల్లో 40 చోట్ల ఐటీ శాఖ ఫిబ్రవరి 6 నుంచి 10వ తేదీ వరకూ సోదాలు నిర్వహించింది.  
చంద్రబాబుకు పీఎస్‌గా పనిచేసిన పెండ్యాల శ్రీనివాస్‌.. బాబు తనయుడు నారా లోకేశ్‌ బినామీలు కిలారు రాజేష్, నరేన్‌ చౌదరి, కడప జిల్లా టీడీపీ అధ్యక్షుడు శ్రీనివాసులరెడ్డి, మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు కుమారుడు ప్రత్తిపాటి శరత్‌ నివాసాలు, కార్యాలయాలపై ఐటీ సోదాల్లో రూ.2,000కోట్ల కమీషన్‌ల బాగోతం వెలుగు చూసింది.  
మూడు ప్రధాన కాంట్రాక్టు సంస్థలు.. బోగస్‌ సబ్‌ కాంట్రాక్టు సంస్థలు ఒకే ఐపీ చిరునామా నుంచి ఐటీ రిటర్నులు దాఖలు చేసి.. భారీ అక్రమాలకు పాల్పడటంపై ఐటీ శాఖ అధికారులే విస్తుపోయారు.  
బోగస్‌ సబ్‌ కాంట్రాక్టర్ల ద్వారా వసూలు చేసిన కమీషన్‌లను సింగపూర్‌కు తరలించి.. అక్కడి నుంచి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల రూపంలో ఆర్వీఆర్‌ ప్రాజెక్ట్సుకు చేర్చి.. చంద్రబాబు తన జేబులో వేసుకోవడం సంచలనం రేపింది.  
మనీ ల్యాండరింగ్‌కు పాల్పడినట్టు నిర్ధారణ కావడంంతో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) రంగంలోకి దిగింది. పెండ్యాల శ్రీనివాస్‌ ఇంట్లో లభ్యమైన డైరీల ఆధారంగా ఐటీ శాఖ విచారణను ముమ్మరం చేయడం.. ఈడీ, జీఎస్టీ ఇంటెలిజెన్స్‌ విభాగాలు దర్యాప్తునకు సిద్ధమవడంతో మూడు రోజులుగా వ్యక్తిగత లాయర్లు, ఆడిటర్లతో చంద్రబాబు ఎడతెగని మంతనాలు జరుపుతున్నారు.  
తన అవినీతి బాగోతంపై జాతీయ మీడియా ప్రశ్నిస్తున్నా చంద్రబాబు నోరు మెదపకపోవడం గమనార్హం.

Advertisement
Advertisement