మళ్లీ పెరిగిన అంచనాలు | Sakshi
Sakshi News home page

మళ్లీ పెరిగిన అంచనాలు

Published Tue, Apr 12 2016 1:30 AM

Increased expectations again

విజయనగరం కంటోన్మెంట్: తారక రామ తీర్ధ సాగర్ పనులకు మరో అవరోధం ఎదురయ్యింది. ఎప్పటికప్పుడు వాయిదాలు, గడువులతోనే సా....గుతున్న పనులకు మరో ఆటంకం ఎదురయింది. ప్రాజెక్టుకు అటవీ అనుమతులు రాకపోయినా అంచనాలు మాత్రం పెరిగిపోతున్నాయి. ప్రాజెక్టు పరిధిలోని రామతీర్థం కొండ లోంచి తవ్వాల్సిన సుమారు కిలోమీటరు పైగా సొరంగం పనులకు సంబంధించి 2008లో రూ.11 కోట్లు మంజూరయ్యాయి. వాటితో అప్పట్లో పనులు చేస్తే సకాలంలో పూర్తయ్యేది. కానీ అటవీ అనుమతులు తీసుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమవ్వడంతో పనులు సాగడం లేదు.

ఇప్పుడు ఈ సొరంగం పనులు చేపట్టేందుకు అవసరమైన అధునాతన మెషీన్లు కొనుగోలు చేయడానికి అప్పటి నిధులు చాలవని కాంట్రాక్టర్లు తేల్చేశారు. ఇప్పుడు ఈ టన్నెల్ తవ్వాలంటే సుమారు రూ. 40 కోట్లు ఖర్చవుతుందని అధికారులు, కాంట్రాక్టర్లు అంచనాలు రూపొందిస్తున్నట్టు తెలుస్తోంది. టన్నెల్ బోరింగ్ మెషీన్లు ఇక్కడే తయారు చేసి పనులు చేయాలి.

ప్రభుత్వం మాత్రం ఈ విషయంలో నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తోంది. ఏళ్ల తరబడి అటవీ అనుమతులపేరుతో కాలయాపన చేస్తుండటంవల్ల టన్నెల్ పనులు అలానే నిలిచిపోయాయి. పెరిగిన ధరలిస్తే తప్ప పనులు చేపట్టలేమని కాంట్రాక్టర్లు చేతులు ఎత్తేయడంతో ప్రాజక్టుకు మరో ఆటంకం ఎదురయినట్టయింది.

Advertisement
Advertisement