నెలవంక(కవిటి),న్యూస్లైన్: నెలవంక పంచాయతీ కార్యాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన మాజీ ప్రధాని ఇందిరాగాంధీ విగ్రహాన్ని దుండగులు శుక్రవారం రాత్రి ధ్వంసం చేశారు. ఈ మేరకు సర్పంచ్ మోహిని బిసాయి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ చిన్నంనాయుడు తెలిపారు. శుక్రవారం రాత్రి గ్రామంలో గౌరీపౌర్ణమి వేడుకల్లో భాగంగా నందన్న సంబరాల ఊరేగింపు రాత్రి 10 గంటల వరకు జరిగింది. అప్పటి వరకు విగ్రహం బాగానే ఉందని స్థానికులు చెబుతున్నారు. అర్ధరాత్రి జనసంచారం లేని సమయంలో ఈ ఘటన జరిగి ఉంటుందని వారు భావిస్తున్నారు.
ఈ ఘటనలో ఇందిరాగాంధీ విగ్రహం తలను విరగ్గొట్టి దాన్ని సమీపంలో చెరువులో పడేశారు. సమైక్యాంధ్ర ఉద్యమ నేపథ్యంలో ఇటీవల వరకు పోలీసులు గాంధీ కుటుంబ విగ్రహాలు ఉన్న నెలవంక, రాజపురం, జగతి తదితర గ్రామాల్లో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. కాని పై-లీన్ తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ఆదివారం సీఎం పర్యటన ఉన్న కారణంగా బందోబస్తును అక్కడికి తరలించడంతో దుండగులు ఈ సంఘటనకు పాల్పడి ఉంటారని స్థానికులు చెబుతున్నారు. విషయం తెలుసుకున్న వెంటనే తహశీల్దార్ గోపాలరావు, ఎంపీడీవో శ్రీనివాసరెడ్డి అక్కడకు వెళ్లి పరిశీలించారు.