ప్రభుత్వరంగ సంస్థల ఉద్యోగులకు కిరణ్ సర్కార్ మొండిచెయ్యి | Sakshi
Sakshi News home page

ప్రభుత్వరంగ సంస్థల ఉద్యోగులకు కిరణ్ సర్కార్ మొండిచెయ్యి

Published Wed, Jan 8 2014 2:00 AM

IR not for Public sector union employees

వారికి ఐఆర్ వర్తించదని జీవోలో స్పష్టీకరణ

 సాక్షి, హైదరాబాద్: మధ్యంతర భృతి(ఐఆర్) విషయంలో ప్రభుత్వరంగ సంస్థల ఉద్యోగులకు కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వం మొండిచెయ్యి చూపింది. ప్రభుత్వ ఉద్యోగులకు ఐఆర్ మంజూరు చేస్తూ ఇచ్చిన జీవోలో.. ప్రభుత్వరంగ సంస్థల(పీఎస్‌యూ) ఉద్యోగులకు ఇది వర్తించదని స్పష్టంచేసింది. దీంతో వేలాదిమంది పీఎస్‌యూ ఉద్యోగులు తాము ప్రభుత్వ ఉద్యోగులం కాదా అని ఆవేదన చెందుతున్నారు. ప్రత్యేకంగా వేతన సవరణ సంఘాలు(పీఆర్సీలు) లేకపోవడంతో ప్రభుత్వ ఉద్యోగులకిచ్చే పీఆర్సీలనే పీఎస్‌యూలు నేరుగా అమలు చేస్తున్నాయి. అదేరీతిలో డీఏ, ఐఆర్ విషయంలోనూ అనుసరిస్తున్నాయి.

ప్రభుత్వరంగ సంస్థలు ఐఆర్ మంజూరు ఉత్తర్వుల్ని అమలు చేసుకునే అవకాశమివ్వడం సంప్రదాయంగా కూడా వస్తోంది. 2008లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వ ఉద్యోగులకు 22 శాతం ఐఆర్ ఇచ్చారు. ప్రభుత్వరంగ సంస్థలు, సహకార సంఘాలు తమ ఉద్యోగులకు ఐఆర్ మంజూరు చేయడానికి అవకాశమిస్తూ జీవోలో స్పష్టం చేశారు. అంతకుముందు ప్రభుత్వరంగ సంస్థల్ని నిర్వీరం చేసిన చంద్రబాబు మాత్రం పీఎస్‌యూ ఉద్యోగులకు పీఆర్సీ వర్తించదంటూ 1999(ఏడో పీఆర్సీ సమయం)లో ఉత్తర్వులి చ్చారు. ఇప్పుడదే బాటలో కిరణ్‌కుమార్‌రెడ్డి పయనించారు. పీఎస్‌యూ ఉద్యోగుల మనోభావాలను దెబ్బతీసేలా ప్రభుత్వం వ్యవహరించిందని పీఎస్‌యూ ఎంప్లాయీస్ ఫెడరేషన్ అధ్యక్షుడు జనార్దన్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement