శోకసంద్రంలో జవాన్ కుటుంబీకులు | Sakshi
Sakshi News home page

శోకసంద్రంలో జవాన్ కుటుంబీకులు

Published Wed, May 18 2016 11:48 PM

Jawan died in gun Miss fire

రాజాం రూరల్ : మండల పరిధిలోని దోసరి పంచాయతీ రామినాయుడువలస గ్రామానికి చెందిన గులిపల్లి రామకృష్ణ(24) ఆకస్మిక మృతితో ఆ కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయూరు. డిగ్రీ చదువుకున్న ఒక్కగానొక్క కొడుకు సీఐఎస్‌ఎఫ్‌లో జవాన్‌గా పని చేస్తూ కుటుంబాన్ని ఆదుకుంటున్నాడని ఎంతో సంబరపడిన తల్లిదండ్రులు తవిటినాయుడు, కామేశ్వరిలకు ఆ ఆనందం ఎంతో కాలం నిలవలేదు.
 
 తోబుట్టువైన చెల్లి హైమావతికి అన్న ప్రయోజుకుడయ్యాడని, త్వరలో తమ కష్టాలు తీరి మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తాడనుకున్న కలలు కల్లలైపోయాయి. ఉద్యోగం వచ్చి నాలుగేళ్లు పూర్తి కాక ముందే  రామకృష్ణ విగతజీవుడిగా మారడం ఆ కుటుంబం తట్టుకోలేకపోతుంది.  రామకృష్ణ అసోం దరిలో సీఐఎస్‌ఎఫ్‌లో జవాన్‌గా పని చేస్తున్నాడు. ఈ నెల 17న ఉదయం 9.05గంటలకు చెల్లి హైమావతితో ఫోన్‌లో మాట్లాడాడు.
 
 అమ్మ..నాన్న ఉన్నారా అని అడుగ్గా ఉపాధి పనులకు వెళ్లారని చెల్లి తెలిపింది. దీంతో ఫోన్ పెట్టేశాడు. అయితే అదే రోజు ఉదయం 10.30 గంటల ప్రాంతంలో చేతిలో ఉన్న తుపాకీ మిస్‌ఫైర్ అయి బుల్లెట్ తగిలి రామకృష్ణ మృతి చెందాడని తోటి జవాన్ ఫోన్‌లో రామకృష్ణ కుటుంబానికి ఫోన్‌లో సమాచారం అందించాడు. దీంతో కుటుంబ సభ్యుల్లో, గ్రామంలో విషాదం అలుముకొంది. అయితే ఎలా మృతి చెందాడన్న విషయమై ఇంకా స్పష్టత రాలేదని మృతదేహం వస్తే నిజాలు తెలుస్తాయని కుటుంబ సభ్యులు తెలిపారు.
 

Advertisement
Advertisement