కరువు జాబితాలోకి.. ఆ నాలుగు మండలాలు | Sakshi
Sakshi News home page

కరువు జాబితాలోకి.. ఆ నాలుగు మండలాలు

Published Thu, Feb 20 2014 3:03 AM

karuvu list to 4 mandals


 అనంతపురం అగ్రికల్చర్, : జిల్లాలో ఎన్‌పీకుంట, తనకల్లు, తలుపుల, యాడికి మండలాలను కూడా  కరవు మండలాల జాబితాలోకి చేర్చారు. రాష్ట్ర విపత్తుల విభాగం (డిజాస్టర్ మేనేజ్‌మెంట్) కమిషనర్ సి.పార్థసారధి ఈ మేరకు బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం జనవరిలో జిల్లాలో 59 మండలాలనే కరువు ప్రాంతాలుగా ప్రకటించింది.
 
   ఆ జాబితాలో ఈ నాలుగు మండలాలకు చోటులేకపోయిన విషయం తెలిసిందే. దీనిపై  రైతులు, రైతు సంఘాలు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కూడా ఆయా మండల కేంద్రాలతో పాటు జిల్లా కేంద్రంలో ఉన్న ఆందోళనలు చేశాయి.  ఫలితంగా జిల్లాలోని 63 మండలాలనూ కరువు ప్రాంతాలుగా ప్రకటించారు.
 రూ.600 కోట్లతో కరువు నివేదిక సిద్ధం-
 తొలి జాబితాలో ఉన్న 59 మండలాల నుంచి వచ్చిన పంట నష్టం అంచనాలను క్రోడీకరించిన నాచురల్ కలామిటి (ఎన్‌సీ) సెల్ అధికారులు రూ.600 కోట్ల నష్టంతో తుది నివేదిక సిద్ధం చేసినట్లు సమాచారం. మండలాలు, పంటల వారీగా తయారు చేసిన కరువు నివేదికను కలెక్టర్ ద్వారా గురువారం వ్యవసాయశాఖ కమిషనరేట్‌కు పంపే ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది.  బుధవారం సాయంత్రానికి 46 మండలాల నివేదిక త యారు చేశారు. ఈ మండలాల పరిధిలో 4.79 లక్షల హెక్టార్లలో పంట దె బ్బతినగా రూ.470 కోట్ల మేర నష్టం జరిగినట్లు పేర్కొన్నారు. అనుకున్న విధంగా 59 మండలాల నుంచి పంట నష్టం అటుఇటుగా రూ.600 కోట్లకు చేరుకునే అవకాశం ఉందన్నారు.  కరువు జాబితాలో లేనందున ఎన్‌పీ కుంట, తలుపుల, తనకల్లు, యాడికి మండలాల్లో పంట నష్టం అంచనాలు వేయలేదు.  ప్రస్తుతం సిద్ధం చేసిన నివేదిక నుపంపాలా? లేదా తక్కిన నాలుగు మండలాల నష్టం చేర్చి పంపాలా.? అనే విషయాన్ని అధికారులు తేల్చుకోలేక పోతున్నారు. 

Advertisement
Advertisement