సీఎం కిరణ్‌ది అవివేకం | Sakshi
Sakshi News home page

సీఎం కిరణ్‌ది అవివేకం

Published Sun, Sep 29 2013 4:12 AM

kiran kumar reddy ignorance

కొత్తూరు, న్యూస్‌లైన్: సీమాంధ్ర ముఖ్యమంత్రి ఎన్.కిరణ్‌కుమార్‌రెడ్డి అధికారదాహంతో తనస్థాయిని మరిచి మాట్లాడుతున్నారని నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే, బీజేపీ నేత నాగం జనార్దన్‌రెడ్డి విమర్శించారు. ఆయన కేవలం సీమాంధ్రకు ముఖ్యమంత్రి కాదనే విషయాన్ని గుర్తుంచుకోవాలని హితవుపలికారు.
 
 ఆ స్థాయిలో ఉన్న కిరణ్ అన్ని ప్రాంతాలకు సమన్యాయం జరిగేలా నిర్ణయాలు తీసుకోవాల్సిందిపోయి ఒకే ప్రాంతానికి అనుకూలంగా మాట్లాడటం అవివేకమని, అలాంటి తీరును వెంటనే మార్చుకోవాలని సూచించారు. శనివారం జిల్లా కేంద్రంలో నిర్వహిస్తున్న తెలంగాణ ప్రజాగర్జన కార్యక్రమంలో పాల్గొనడానికి వస్తున్న లోక్‌సభ ప్రతిపక్ష నేత సుష్మస్వరాజ్‌కు స్వాగతం పలకడానికి ఆయనతో పాటు పలువురు రాష్ర్ట, జిల్లా నాయకులు జిల్లా ముఖద్వారమైన తిమ్మాపూర్ వద్దకు భారీసంఖ్యలో చేరుకున్నారు. నాగం విలేకరులతో మాట్లాడుతూ..రాష్ట్రంలో నెలకొన్న పలు పరిస్థితుల కారణంగా రానున్న నెలరోజుల్లో రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన కొన సాగడం ఖాయమన్నారు. కాంగ్రెస్ ఇప్పుడు తెలంగాణకు అడ్డుచెప్పినా..బీజేపీ అధికారంలోకి రాగానే నెలరోజుల్లో ప్రత్యేకరాష్ట్రాన్ని ఏర్పాటు చేయడం ఖాయమన్నారు. తెలంగాణ ప్రజలు చేస్తున్న ఉద్యమాలకు అనేక కారణాలు ఉన్నాయని, సీమాంధ్రప్రజలు ఎందుకు ఆందోళనలు చేస్తున్నారో అర్థం కావడం లేదన్నారు. అన ంతరం బీజేపీ జాతీయ నాయకురాలు సుష్మస్వరాజ్‌తో పాటు రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డికి పలువురు నేతలు, విద్యార్థులు ఘనంగా స్వాగతం పలికారు. కార్యక్రమంలో మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే ఎన్నం శ్రీనివాస్‌రెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు రతంగ్‌పాండురంగారెడ్డి, ప్రధాన కార్యదర్శి శ్రీవర్దన్‌రెడ్డి, రాష్ట్ర లీగల్‌సెల్ కో కన్వీనర్ చెంది మహేందర్‌రెడ్డి, స్టేట్‌కౌన్సిల్ సభ్యుడు పాతపల్లి కృష్ణారెడ్డి, బీజేఎంఎం జిల్లా అధ్యక్షుడు ఆశోక్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement
Advertisement