తిరుమల: శ్రీవారి ఆలయంలో మంగళవారం ఉదయం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు సెప్టెంబరు 23 నుండి ప్రారంభం కానున్న నేపథ్యంలో ఉదయం శ్రీవారి ఆలయాన్ని శుద్ధి చేశారు. సాధారణంగా సంవత్సరంలో నాలుగు సార్లు ఈ కోయిల్ ఆళ్వార్ తిరుమంజనాన్ని నిర్వహించడం ఆనవాయితీ. ఉగాది, ఆణివార ఆస్థానం, బ్రహ్మోత్సవాలు, వైకుంఠ ఏకాదశి పర్వదినాలకు ముందు వచ్చే మంగళవారం నాడు ఈ ఆలయశుద్ధి కార్యక్రమాన్ని నిర్వహిస్తారు.
ఈ సందర్భంగా మంగళవారం ఉదయం 6.00 నుండి 11.00 గంటల సర్వదర్శనాన్నీ నిలిపివేసి గర్భాలయం, ఉప ఆలయాలు, పోటు, పైకప్పు, పూజాసామగ్రి తదితర వస్తువులను శుద్ధి చేసారు. ఆ తరువాత నామకోపు, శ్రీచూర్ణణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచీలీగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్ర తిరుమంజనాన్ని ఆలయం అంతటా పూసి నీటితో శుద్ధి చేసిన అనంతరం మధ్యాహ్నం 12.00 గంటల నుండి సర్వదర్శనానికి భక్తులను అనుమతించారు . కోయిల్ ఆళ్వార్ తిరుమంజనాన్ని పురస్కరించుకుని ప్రతి మంగళవారం నిర్వహించే అష్టదళ పాదపద్మారాధన సేవను టీటీడీ రద్దు చేసింది.