నందివాడ (గుడివాడ): పీపుల్స్వార్ పార్టీ వ్యవస్థాపకుల్లో ఒకరైన కొండపల్లి సీతారామయ్య (కేఎస్) సతీమణి కోటేశ్వరమ్మ (99) విశాఖపట్నంలో కన్నుమూశారు. వారం రోజుగా అనారోగ్యంతో బాధపడుతూ బుధవారం ఉదయం మనుమరాళ్లయిన అనురాధ, సుధ ఇంటి వద్ద కోటేశ్వరమ్మ తుదిశ్వాస విడిచారు. ఆమె మృతి చెందిన విషయం తెలుసుకున్న జనార్దనపురం గ్రామస్తులు విషాదంలో మునిగారు. మండలంలోని జనార్దనపురం గ్రామానికి చెందిన సీతారామయ్యకు కమ్యూనిస్టు భావాలు ఉండటంతో వంగపాటి రంగారెడ్డి ఆధ్వర్యంలో సీతారామయ్య 1933లో కమ్యూనిస్టు పార్టీలో చేశారు. పామర్రుకు చెందిన కోటేశ్వరమ్మను 1939లో ఆదర్శ వివాహం చేసుకున్నారు. వంగపాటి రంగారెడ్డి రక్షణలో కోటేశ్వరమ్మ రెండు సంవత్సరాల పాటు జనార్దనపురంలోనే కాపురం ఉన్నారు. వారికి అప్పుడే చంద్రశేఖర్రెడ్డి, కరుణ జన్మించారు.
జనార్దనపురం విడిచి....
సీతారామయ్య కొద్దికాలనికే జనార్దనపురం గ్రామం విడిచి కరీంనగర్ వెళ్లిపోయారు. ఆయనతో పాటు కోటశ్వరమ్మ తన బిడ్డలతో కలిసి వెళ్లిపోయారు. అనంతరం కొంతకాలనికి సీతారామయ్య కమ్యూనిస్టు పార్టీతో విభేదించి పీపుల్స్వార్ను స్థాపించి అజ్ఞాతంలోకి వెళ్లారు. పీపుల్స్వార్లో సీతారామయ్య చురుగా పని చేస్తున్న సమయంలో పోలీసులు సీతారామయ్య కుమారుడు చందును ఎన్కౌంటర్ పేరుతో బలితీసుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న కోటేశ్వరమ్మ తీవ్ర మనోవేదనకు గురైయింది.
దీంతో డాక్టర్ చదువుతున్న కుమార్తె కరుణకు వెంటనే వివాహం చేసింది. కుమారుడు చనిపోవటం, భర్త నక్సల్స్ ఉద్యమంల్లో ఉండటం, కుమార్తెకు వివాహం కావటంతో ఒక్కసారి కోటేశ్వరమ్మ ఒంటరి అయిపోయింది. దీంతో హైదరాబాద్లోని చండ్ర రాజేశ్వరరావు ఫౌండేషన్ వారు కోటేశ్వరమ్మను చేరదీశారు. కొంత కాలనికి సీతారామయ్య, కుమార్తె కరుణ కూడా మృతి చెందారు. కరుణకు కుమార్తెలు అనురాధ, సుధ మాత్రం తమ అమ్మమ్మను ఫౌండేషన్ నుంచి సొంత ఊరైన విశాఖపట్నం తీసుకువెళ్లారు. గత ఆగస్టు 5 వ తేదీన కోటేశ్వరమ్మ నూరో పుట్టినరోజు ఉత్సవం కూడా ముందుగానే జరుపుకున్నారు. నెల కూడా గడవకముందే ఇలా మృతి చెందటం పట్ల పలువురు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
మహిళా సంఘ నాయకురాలు...
భర్త సీతారామయ్య నక్సల్స్ ఉద్యమంలో ఉన్న సమయంలో కోటేశ్వరమ్మ మహిళ సంఘాల నాయకురాలుగా అనేక విప్లవ వ్యాసలు రాశారు. నిర్జనవారధి అనే పుస్తకం ఇప్పటికి ఎవరు మరచిపోరు. ఈ పుస్తకంలో విప్లవకారుల బాధలు, వారి కుటుంబసభ్యులు పడుతున్న అవస్థలు వంటి అంశాలను పొందుపరిచారు. అప్పట్లో ఈ పుస్తకం చాలా బాగా అమ్ముడైన్నట్లు పలువురు నేతలు చెబుతున్నారు. ముఖ్యంగా నక్సల్స్ కుటుంబాలలో మహిళలు పడుతున్న ఇబ్బందులను కళ్లకు కట్టిన్నట్లు కోటేశ్వరమ్మ చూపించారని చెప్పుకుంటారు.
కోటేశ్వరమ్మ మృతికి ఇస్కఫ్ సంతాపం
మధురానగర్ (విజయవాడ సెంట్రల్): ప్రముఖ సంఘసేవకురాలు, అభ్యుదయ, ప్రగతి శీల మహిళా నేత నూరేళ్ళ వనిత కొండపల్లి కోటేశ్వరమ్మ మృతి పట్ల భారత సాంస్కృతిక సహకార స్నేహ సంఘం ( ఇస్కఫ్) జాతీయ అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే కె.సుబ్బరాజు బుధవారం ఒక ప్రకటనలో సంతాపం ప్రకటించారు. కొండపల్లి కోటేశ్వరమ్మ ప్రజాతంత్ర, ప్రగతిశీల మహిళా ఉద్యమాలలో చురుగ్గా పాల్గొనటమే కాకుండా సమాజ మార్పునకు మహిళలు ముందుండాలని భావించారని సుబ్బరాజు పేర్కొన్నారు. హైదరాబాద్, విజయవాడ నగరాల్లో జరిగిన నాటి ఇస్కస్, శాంతి ఉద్యమాలతో పాటు ఈనాటి ఇస్కఫ్ కార్యక్రమాలలో కూడా కోటేశ్వరమ్మ చురుగ్గా పాల్గొన్నారన్నారు. పరిపూర్ణ జీవితం గడిపిన ఆమె జీవితం యువ మహిళలకు స్ఫూర్తిదాయకం కావాలని ఆకాంక్షించారు.