కృష్ణ..కృష్ణా..! | Sakshi
Sakshi News home page

కృష్ణ..కృష్ణా..!

Published Thu, Apr 14 2016 1:48 AM

కృష్ణ..కృష్ణా..! - Sakshi

డబ్బుల్లేవ్..అంచనాలు తగ్గించండి
పుష్కర పనులపై అధికారుల అంతర్గత ఆదేశాలు
ఆహ్వానించిన టెండర్ల  రద్దుకు చర్యలు
స్నానఘాట్లలో భక్తులకు తప్పని ఇక్కట్లు

 
చరిత్రలో నిలిచిపోయేలా కృష్ణా పుష్కరాలు నిర్వహిస్తామని రాష్ట్ర మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, దేవినేని ఉమ ఓ వైపు ప్రకటనలు చేస్తుంటే, మరో వైపు ఉన్నతాధికారులు పుష్కర పనుల అంచనాలనుతగ్గిస్తున్నారు. చిన్నపాటి మరమ్మతులతో పాత ఘాట్‌లను పూర్తి చేసి, అత్యవసర పనులనుచేయాలంటున్నారు. ఇప్పటి వరకు చేసిన అంచనాల మొత్తాలను 80 శాతం తగ్గించాలని, ఆహ్వానించిన
 టెండర్లను రద్దు చేయాలని అంతర్గత ఆదేశాలు ఇస్తున్నారు.

 
 
సాక్షి ప్రతినిధి, గుంటూరు : గోదావరి పుష్కరాల కంటే వైభవంగా కృష్ణా పుష్కరాలు నిర్వహిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా ప్రకటించారు. ఆ మేరకు రూ.1500 కోట్ల వరకు నిధులు కేటాయిస్తామన్నారు. దీంతో వివిధ శాఖల ఇంజినీర్లు కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని నదీ పరివాహక ప్రాంతాల్లో పర్యటించి పాత స్నానఘాట్‌లను పరిశీలించారు. అవసరమనుకున్న ప్రాంతంలో కొత్త ఘాట్‌ల నిర్మాణాలకు అంచనాలు తయారు చేశారు. ఇప్పుడు వాటన్నింటినీ పక్కన పడేసి పాత ఘాట్‌లకు తాత్కాలిక మరమ్మతులు చేయడానికి అంచనాలు తయారు చేయాలని, ఘాట్‌ల వద్ద భక్తులు పడిపోకుండా గ్రిప్ టైల్స్ ఏర్పాటుకు అంచనాలు తయారు చేస్తే, అవేమీ అక్కర్లేదు పాడైపోయిన ఘాట్‌లకు సిమెంట్‌తో ప్లాస్టరింగ్ చేయాలని, గ్రిప్ టైల్స్ వేయకుండా ఘాట్‌లకు రెడాక్సైడ్ రంగు వేయాలని ఆదేశించినట్టు తెలుస్తోంది.


కృష్ణా నదిలో నీటిమట్టం గరిష్టంగా పడిపోయిన నేపథ్యంలో ప్రకాశం బ్యారేజీ దిగువన భక్తులు స్నానమాచరించడానికి నదిలో ఒక పాయను ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనను నిలిపివేసి, జల్లు స్నానంకు అంచనాలు తయారు చేయాలని ఆదేశాలు జారీ చేస్తున్నారు. ఈ నెల 12న విజయవాడ నీటిపారుదల సర్కిల్ కార్యాలయం, విజయవాడ కేసీ డివిజన్ ఇంజినీర్లు ప్రకాశం బ్యారేజి దిగువనున్న 33 పుష్కర ఘాట్‌ల మర్మమతులకు టెండర్లు ఆహ్వానించారు. సుమారు రూ.20 కోట్ల విలువైన పనులకు సంబంధించిన సమాచారాన్ని ఈ ప్రొక్యూర్‌మెంట్ మార్కెట్ ప్లేస్‌లో ఏర్పాటు చేశామని వివిధ దినపత్రికల్లో నోటిఫికేషన్ ఇచ్చారు.

ఈ మేరకు ఒక్క విజయవాడ పరిధిలోనే పుష్కర ఘాట్‌లకు రూ.20 కోట్లకుపైగా నిధులు కేటాయింపు జరిగినట్టు ఆ నోటిఫికేషన్ ద్వారా సమాచారం తెలుసుకున్న కాంట్రాక్టర్లు పనులు చేసేందుకు ముందుకు వస్తున్నారు. అయితే ఈ నోటిఫికేషన్ ఇచ్చిన తరువాత కృష్ణాజిల్లా కలెక్టర్ ఆ అంచనాల మొత్తాలను 80 శాతం తగ్గించాలని ఇరిగేషన్ శాఖ అధికారులను ఆదేశించారు. దీంతో ఆ శాఖ ఇంజినీర్లు బిత్తరపోవడమే కాకుండా పుష్కర ఘాట్‌లకు గ్రిప్‌టైల్స్ వేయకుండా మరమ్మతులు చేస్తే భక్తులు ఇబ్బంది పడే అవకాశం ఉందంటున్నారు. అదే అభిప్రాయాన్ని వెల్లడించినా, టైల్స్ అవసరం లేదు. రెడ్ ఆక్సైడ్ వేయండంటూ ఆదేశించినట్టు తెలుస్తోంది. ఇలా అంచనాల మొత్తాలను పూర్తిగా తగ్గించాలని ఆదేశాలు జారీ చేయడంతో సాగునీటిశాఖ అధికారులు పనులు ఎలా పూర్తి చేయాలో అర్థంకాక సతమతమవుతున్నారు.


 గుంటూరు జిల్లాలోనూ ఇంతే...
గుంటూరు జిల్లాలోనూ పరిస్థితి ఇందుకు భిన్నంగా లేదు. వివిధ శాఖల అధికారులు చేసిన అంచనాలకు భిన్నంగా అరకొరగా నిధులు మంజూరు చేయడంతో ముఖ్యమైన పనుల జాబితాలను తయారు చేసే పనిలో అధికారులున్నారు. పుష్కర ఘాట్‌లకు రూ.150 కోట్లతో అంచనాలు తయారు చేస్తే, రాష్ట్ర ప్రభుత్వం రూ.65 కోట్లను మంజూరు చేసింది. సీతానగరం ఘాట్‌లో 3 పనులకు రూ.20 కోట్లతో అంచనాలు తయారు చేస్తే రూ.15 కోట్లకు తగ్గించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. జిల్లాలోని మొత్తం అన్ని శాఖలు రూ.485 కోట్లతో అంచనాలు తయారు చేస్తే ఇప్పటి వరకు రూ.360 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది.

అంచనాలను భారీ ఎత్తున రూపొందించినప్పటికీ, ప్రభుత్వం వద్ద నిధుల కొరత ఉండడంతో వాటిలో కోత విధిస్తోంది. ఆగస్టులో జరగనున్న ఈ పుష్కరాలకు ఇంకా ప్రతిపాదనలు దశ పూర్తికాకపోవడం, టెండర్లు ఆహ్వానించే దశలోనే అధికారులు ఉండడంతో పనులపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

Advertisement
Advertisement