బాబుకు జేఎంసీ షాక్ | Sakshi
Sakshi News home page

బాబుకు జేఎంసీ షాక్

Published Wed, Apr 9 2014 2:40 AM

బాబుకు జేఎంసీ షాక్ - Sakshi

సాక్షి, చిత్తూరు: తెలుగుదేశం పార్టీ చిత్తూరు జిల్లా అధ్యక్షులు జంగాలపల్లి శ్రీనివాసులు(జేఎంసీ) ఆ పార్టీ అధినేత చంద్రబాబుకు గట్టి షాక్ ఇచ్చారు. చంద్రబాబు నిరంకుశ పోకడలు, నమ్మకద్రోహానికి నిరసనగా ఆ పార్టీ పదవికి, సభ్యత్వానికి రాజీనామా చేశారు. మంగళవారం హైదరాబాద్‌లో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో వైఎస్సార్ సీపీలో చేరారు.

టీడీపీ జిల్లా పగ్గాలు తీసుకునేందుకు ఎవరూ ముందుకు రాని సమయంలో, కష్టకాలంలో ఆ పార్టీ భారం మోసిన జం గాలపల్లి శ్రీనివాసులుకు చంద్రబాబు చిత్తూరు ఎమ్మెల్యే టికెట్టు ఇస్తానని హామీ ఇచ్చి, ఇప్పు డు డీకే కుటుంబానికి టికెట్టు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు.
 
దీంతో తన అభిప్రాయానికి విలువ ఇవ్వని పార్టీలో కొనసాగలేక జంగాలపల్లి శ్రీనివాసులు బయటకు వచ్చారు. జిల్లా తెలుగుదేశం నాయకులకు కూడా ఒకరకంగా ఇది పెద్దషాకే. పార్టీలో కష్టపడి పని చేస్తూ జిల్లా అధ్యక్ష స్థానం లో ఉన్న వ్యక్తికే విలువ ఇవ్వకపోతే రేపు ఎన్నికల్లో కష్టపడి పనిచేసినా తమకెంతమాత్రం గౌరవమిస్తారనే ప్రశ్న వ్యక్తమవుతోంది. చిత్తూరులో తొలి నుంచి ట్రస్టు ద్వారా ఉచిత మంచినీటి సరఫరా, ఇతర సేవా కార్యక్రమాలు చేస్తున్నారని ప్రజల్లో జంగాలపల్లికి పేరుంది.
 
 గతంలో సుదీర్ఘకాలం టీడీపీలో కొనసాగారు. 2009లో పీఆర్పీ నుంచి చిత్తూరు ఎమ్మెల్యేగా పోటీ చేసి సీకే బాబు చేతిలో 1500 ఓట్ల తేడాతో ఓడిపోయూ రు. తర్వాత టీడీపీలో చేరారు. జిల్లా నాయకత్వం తీసుకునేందుకు, పార్టీ కోసం డబ్బులు ఖర్చుచేసేందుకు అందరూ వెనుకాడుతున్న తరుణంలో జిల్లా బాధ్యతలను తలకెత్తుకుని పనిచేశారు. అయినా చంద్రబాబు సామాజికవర్గం తొలి నుంచి చిత్తూరు టికెట్టు రానివ్వకుండా జంగాలపల్లికి అడ్డుపడుతూ వచ్చింది. ఈ నేపథ్యంలో ఆయన ఆ పార్టీ నుంచి బయటకు రావాలని నిర్ణయం తీసుకున్నారు.
 
 చిత్తూరులో బలోపేతమైన వైఎస్సార్‌సీపీ
జంగాలపల్లి శ్రీనివాసులు వైఎస్సార్‌సీపీలో చేరడంతో చిత్తూరు, పలమనేరు నియోజకవర్గాల్లోని ఆయన అనుచరవర్గం, బంధువులు వైఎస్సార్‌సీపీ వైపు రానున్నారు. తద్వారా సార్వత్రిక ఎన్నికల్లో చిత్తూరు నియోజకవర్గంలో వైఎస్సార్‌సీపీ బలపడుతుంది. అంతేగాక గెలుపుదిశగా పయనించడానికి అవకాశం ఉంది. అదే సమయంలో టీడీపీలోని బలిజ సామాజికవర్గానికి చెందిన ప్రధానమైన వర్గం వైఎస్సార్‌సీపీ వైపు మరలనుంది.
 
 ఇప్పటికే ఏఎస్ మనోహర్‌ను ఇక్కడ బలిజ సామాజికవర్గం నుంచే పార్టీ సమన్వయకర్తగా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నియమించారు. ఇప్పుడు అదే సామాజికవర్గానికి ఇంకా ప్రాధాన్యం ఇచ్చి మరొక ముఖ్య నాయకుడిని పార్టీలో చేర్చుకున్నారు. ఈ క్రమంలో చిత్తూరు నియోజకవర్గంలో ఓట్లపరంగా అధిక సంఖ్యలో ఉన్న బలిజ సామాజికవర్గం వైఎస్సార్‌సీపీకి మద్దతుగా నిలవనుంది.
 
 మరికొంత మంది వైఎస్సార్‌సీపీ బాట

బాబు వైఖరితో విసిగిపోయిన ఇంకొంతమంది తెలుగుదేశం పార్టీ జిల్లా నాయకులు కూడా త్వరలో వైఎస్సార్‌సీపీ బాట పట్టనున్నారు. సొంత జిల్లాలో చంద్రబాబుకు ఇది దిమ్మతిరిగి మైండ్ బ్లాక్ అయ్యే విషయమే. ఇప్పటికే మదనపల్లెలో అసెంబ్లీ టికెట్టు బీజేపీకి వదిలేసిన కారణంగా తమ్ముళ్ల తిరుగుబాటు చంద్రబాబుకు సమస్యగా ఉంది. ఈ క్రమంలో చిత్తూరు నియోజకవర్గంలోనూ పార్టీ కోసం రూ.కోట్లు ఖర్చుపెట్టగలిగే వారికే టికెట్టు ఇవ్వాలని నిర్ణయం తీసుకుని, జంగాలపల్లి శ్రీనివాసులుకు మొండిచేయి చూపడంతో ఆయన జిల్లా అధ్యక్ష పదవికి, పార్టీకి రాజీనామా చేశారు.
 
పార్టీ పగ్గాలు చంద్రబాబుకు చేతికి వచ్చిన తర్వాత సొంత జిల్లాలో ఇంత పెద్ద స్థాయిలో షాక్ ఇవ్వడం ఇదే తొలిసారి అని, ఎన్నికల ముందు ఇప్పటికిప్పుడు టీడీపీ జిల్లా అధ్యక్షునిగా ఉండేందుకు ఎవరూ ముందుకు వచ్చే పరిస్థితి లేదని తెలుగు తమ్ముళ్లు చెబుతున్నారు. ఇప్పుడు జిల్లా అధ్యక్ష పదవి తీసుకుంటే చేతి నుంచి నిర్వహణ ఖర్చులు, ఇతర ఖర్చులు వారే పెట్టుకోవాల్సి వస్తుంది.

దీంతో ఆ దిశగా ఆలోచన చేయూలంటేనే టీడీపీ నాయకులు వెనుకంజ వేస్తున్నారు. ఈ క్రమంలో సార్వత్రిక ఎన్నికల నామినేషన్ దాఖలు కార్యక్రమం ఏప్రిల్ 12 నుంచి ప్రారంభం కానుంది. ఇప్పుడు చంద్రబాబు సొంత జిల్లాలోనే  జంగాలపల్లి రాజీనామాతో టీడీపీ  చుక్కాని లేని నావలాగా తయారైనట్లే.

Advertisement
Advertisement