సరైన ప్యాకేజీ ఇస్తే విభజనకు సిద్ధం: పనబాక లక్ష్మీ | Sakshi
Sakshi News home page

సరైన ప్యాకేజీ ఇస్తే విభజనకు సిద్ధం: పనబాక లక్ష్మీ

Published Tue, Nov 12 2013 9:51 AM

సరైన ప్యాకేజీ ఇస్తే విభజనకు సిద్ధం: పనబాక లక్ష్మీ - Sakshi

సీమాంధ్రను మరో సింగపూర్... బాపట్లను మరో భాగ్యనగరం తీర్చిదిద్దతామని కేంద్ర మంత్రి పనబాక లక్ష్మీ వెల్లడించారు. సొంత నియోకవర్గమైన బాపట్లో పర్యటించేందుకు మంగళవారం ఉదయం ఆమె గుంటూరు చేరుకున్నారు. ఈ సందర్బంగా పనబాక లక్ష్మీ మాట్లాడుతూ... మంచి ప్యాకేజీ ఇస్తే విభజనకు తాము సిద్ధమన్నారు. 

వచ్చే పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో తెలంగాణ బిల్లు ప్రవేశపెడతారని పనబాక స్పష్టం చేశారు. రాష్ట్ర విభజనతో సీమాంధ్ర ప్రాంతానికి ఎట్టి పరిస్థితుల్లో నష్టం వాటిల్లదని ఆమె భరోసా ఇచ్చారు. రాష్ట్ర విభజనపై భారతీయ జనతా పార్టీ రెండు నాల్కల ధోరణితో వ్యవహరిస్తోందని ఆమె ఆ పార్టీని దుయ్యబట్టారు. తెలంగాణ బిల్లుపై కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం మేరకు తాము ఓటు వేస్తామన్నారు.

మరోవైపు రాష్ట్ర విభజనపై కేంద్ర ప్రభుత్వం తనదైన శైలీలో దూసుకుపోతుంది. అయితే రాష్ట్ర విభజనతో తమకు తీరని అన్యాయం జరుగుతుందని సీమాంధ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సీమాంధ్రలోని 13 జిల్లాలో సమైక్య ఉద్యమం ఉవ్వెత్తున్న ఎగసి పడుతోందన్న విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో సీమాంధ్ర వాసులు కేంద్ర మంత్రులు, ఎంపీలు వెంటనే తమ పదవులకు రాజీనామ చేసి సమైక్య ఉద్యమంలో పాల్గొన్నాలని డిమాండ్ చేశారు. దాంతో కేంద్రమంత్రులు ఎటుపాలు పోని పరిస్థితి ఏర్పడింది. అయితే రాష్ట్ర విభజన తథ్యమని కేంద్రం స్పష్టం చేయటంతో  తమ ప్రాంత అభివృద్దికి ప్రత్యేక ప్యాకేజీలు కావాలని  సీమాంధ్రకు చెందిన కేంద్రమంత్రులు, ఎంపీలు ఇప్పటికే ప్రధాని, ఆంటోని, దిగ్విజయ్ సింగ్... తదితరులను కలసి విజ్ఞప్తి చేసిన విషయం విదితమే.

Advertisement

తప్పక చదవండి

Advertisement