ప్రియుడి నుంచి ప్రాణహాని | Sakshi
Sakshi News home page

ప్రియుడి నుంచి ప్రాణహాని

Published Mon, Mar 16 2015 1:42 AM

Life-threatening my lover suresh

కాకినాడ రూరల్ : ప్రేమ, పెళ్లి పేరుతో శీలం సురేష్ తనను మోసం చేయడమే కాకుండా హత్యచేసేందుకు యత్నిస్తున్నాడని, పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవవడం లేదని కాకినాడ ఏటిమొగకు చెందిన  యువతి ఓలేటి శివగాయత్రి ఆదివారం విలేకరుల వద్ద విలపించారు. తనకు అండగా ఉన్న టీడీపీ నాయకురాలిపైనా సురేష్ వర్గం వారు దాడి చేసి బెదిరించారని ఆవేదన వ్యక్తం చేశారు. శివగాయత్రి, టీడీపీ నాయకురాలు రాయవరపు సత్యభామ కథనం ప్రకారం..  శివగాయత్రి,  శీలం సురేష్ ఇద్దరూ ఓకే సామాజిక వర్గం వారు. వీరు ఆరేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. సురేష్‌కు దగ్గర బంధువు, ప్రముఖ మత్స్యకార నాయకుడు వేరే అమ్మాయితో సురేష్ పెళ్లి చేయడానికి యత్నించారు. మాయ మాటలతో అప్పటికే గర్భిణి అయిన  శివగాయత్రికి అబార్షన్ చేయించి అడ్డు తప్పించే యత్నం చేయడంతో శివగాయత్రి  2013 మార్చి 6న నిర్భయచట్టం కేసుపెట్టారు. పోలీసులు సురేష్‌ను అరెస్టు చేసి జైలుకు పంపారు.
 
 అనంతరం సురేష్ బయటకు వచ్చి శివగాయత్రిని మాయమాటలతో నమ్మించాడు. మళ్లీ ఇటీవల వేరే అమ్మాయితో పెళ్లికి సిద్ధమై శివగాయత్రిని చంపేస్తానని, కేసు ఉపసంహరించుకోవాలని బెదిరించాడు. అదే సమయంలో రాయవరపు సత్యభామపైనా దాడికి పాల్పడ్డాడు. దీంతో ఆమె వన్‌టౌన్ పోలీసు స్టేషన్‌లో కేసుపెట్టింది. ఈ విషయాన్ని స్థానిక ఎమ్మెల్యే సోదరునికి వివరించామని, శివగాయత్రికి న్యాయం చేయాలని కోరామని సత్యభామ తెలిపారు. శివగాయత్రికి న్యాయం జరుగుతుందని హామీ రావడంతో  తాను పెట్టిన కేసును ఉపసంహరించుకున్నట్లు వెల్లడించారు.
 
 ఇదిలా ఉండగా శుక్రవారం ఉదయం 8గంటల సమయంలో సురేష్ శివగాయత్రిని కొట్టి,  పీకనొక్కి చంపేందుకు యత్నించాడని,  ఆమెను అతి కష్టం మీద కాకినాడ జీజీహెచ్‌కు 108లో తరలించామని సత్యభామ తెలిపారు. దీనిపై వన్‌టౌన్‌చ పోర్టు పోలీసు స్టేషన్లలో ఫిర్యాదు చేసినా చర్యల్లేవని విమర్శించారు. ఆస్పత్రిలోనూ మెడికో లీగల్ కేసు నమోదు చేయలేదన్నారు.  తనను కూడా చంపేస్తానంటూ సురేష్, అతని బంధువులు బెదిరిస్తున్నారని సత్యభామ వివరించారు. మోసం చేసిన వ్యక్తులకు పోలీసులు కొమ్ముకాస్తున్నారని ఆమె విమర్శించారు. న్యాయం కోసం  శివగాయత్రి నిరహారదీక్షకు కుర్చుంటుందని ఆమె పేర్కొన్నారు.  శివగాయత్రికి న్యాయం జరిగే వరకు తాను ఆమెకు అండగా ఉంటానని స్పష్టం చేశారు. ఈ విషయాన్ని జిల్లా పోలీసుల దృష్టికి తీసుకువెళ్లనున్నట్లు సత్యభామ, శివగాయత్రి తెలిపారు.
 

Advertisement
Advertisement