రుణ మాఫీ శాశ్వత పరిష్కారం కాదు | Sakshi
Sakshi News home page

Published Wed, Oct 4 2017 2:40 AM

Loan waiver It's not a permanent solution

సాక్షి, అమరావతి: వ్యవసాయ సంక్షోభానికి రుణమాఫీ శాశ్వత పరిష్కారం కాదని ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు అన్నారు. కష్టాల్లో చిక్కుకున్న రైతులకు అప్పుల మాఫీ తాత్కాలిక ఉపశమనం మాత్రమేన న్నారు. నదుల అనుసంధానమే శాశ్వత పరిష్కారమని పేర్కొన్నారు. వ్యవసాయ విధానంలోనే మౌలిక మార్పులు రావాల్సిన అవసరం ఉందని స్పష్టంచేశారు. రైతు నేస్తం, ముప్పవరపు ఫౌండేషన్‌ సంయుక్త ఆధ్వర్యంలో మంగళవారం విజయవాడ సమీపంలోని స్వర్ణభారతి ట్రస్ట్‌లో జరిగిన రైతు నేస్తం పురస్కారాల ప్రదానోత్సవంలో ఆయన ప్రసంగించా రు. వ్యవసా య రంగంలో ప్రగతి ఉన్నప్పటికీ.. వస్తున్న ఫలితాలు రైతుకు అనుకూలంగా లేవని చెప్పారు. తాను పండించే పంటకు తానే ధర నిర్ణయించుకునే స్థాయికి రైతు ఎదగాల్సి ఉందని, అందుకు ప్రభుత్వ విధానాలు దోహదపడాలని సూచించారు. మీడియా కూడా వ్యవ సాయ వార్తలకు ప్రాధాన్యత ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. 

రైతు తలెత్తుకొని బతకాలి: పోచారం  
రైతు తలెత్తుకుని బతికే రోజు రావాలని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ మేరకు పథకాలు రూపొందించాలని ఈ కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి చెప్పారు. ప్రకృతి సేద్య ప్రముఖుడు పాలేకర్‌ విధానాలతో ఆరేళ్లుగా ప్రకృతి సాగుతో పలు రకాల కూరలు, పండ్లు పండిస్తు న్న కుంచనపల్లి రైతు ఆరుమళ్ల సాంబిరెడ్డి వ్యవసాయ క్షేత్రంపై పోచారం మక్కువ చూపారు. సాక్షి సాగుబడి పేజీలో ఇటీవల ఆయనపై రాసిన ప్రత్యేక కథనాన్ని చదివిన పోచారం.. నేరుగా సాంబిరెడ్డికి ఫోన్‌ చేసి మాట్లాడారు. విజయవాడకు వస్తూనే సమీపంలోని కుంచనపల్లికి వెళ్లి సాంబిరెడ్డి పొలాన్నీ, సాగుబడి తీరును చూసివచ్చినట్టు తెలిపారు. సభలో తెలంగాణ ప్రభుత్వం, రైతునేస్తం మధ్య విత్తన ధృవీకరణ సంస్థకు సంబంధించి అవగాహనా ఒప్పందం కుదిరింది. నీలివిప్లవం, రైతు నేస్తం పురస్కారాల ప్రత్యేక సంచిక, సేంద్రియ మొబైల్‌ యాప్‌ను వెంకయ్య నాయుడు ఆవిష్కరించారు.  రైతు నేస్తం ఫౌండేషన్‌ చైర్మన్‌ వై.వెంకటేశ్వరరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఏపీ ఉప సభాపతి మండలి బుద్ధప్రసాద్, వ్యవ సాయ మంత్రి సోమిరెడ్డి, వ్యవసాయ పరిశోధన, నిర్వహణ జాతీయ మండలి (నారమ్‌) డైరెక్టర్‌ సీహెచ్‌ శ్రీనివాసరావు పాల్గొన్నారు.

సాక్షి ప్రతినిధికి అవార్డు
అగ్రి జర్నలిజంలో సాక్షి తెలంగాణ బ్యూరో ప్రతినిధి బొల్లోజు రవి అవార్డు అందుకున్నారు. ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, పోచా రం, సోమిరెడ్డి తదితరులు ఆయనకు శాలువా కప్పి జ్ఞాపికను అందజేశారు. తెలంగాణ రైతుల పక్షాన ఆయన రాసిన పలు విశ్లేషణాత్మక కథనాలకు ఈ అవార్డును బహూకరించినట్టు నిర్వా హకులు ప్రకటించారు. జర్నలిజంలో అవార్డులు స్వీకరించిన వారిలో రూరల్‌ మీడియా ఎడిటర్‌ శ్యాంమోహన్,  ప్రకృతి ఆధారిత వ్యవసాయం చేస్తున్న రంగారెడ్డి జిల్లా రైతు మనోహరాచారి, ఎ.పద్మావతి (టీవీ–1), బస్వోజు మల్లిక్, భాగవతుల బుజ్జిబాబు (ఈటీవీ), జి.నాగేశ్వరరెడ్డి (ఆకాశవాణి), ఈవూరి రాజారత్నం (టీవీ–5) ఉన్నారు. వనజీవి రామయ్యగా ఖ్యాతి గాంచిన దరిపల్లి రామయ్యకు ప్రకృతి రత్న, వ్యవ సాయ శాస్త్రవేత్త డాక్టర్‌ ఆలపాటి సత్యనారాయణకు కృషిరత్న అవార్డును అందజేశారు.

Advertisement
Advertisement