ప్రాదేశిక పోరు | Sakshi
Sakshi News home page

ప్రాదేశిక పోరు

Published Tue, Mar 11 2014 12:53 AM

Local elections schedule Release

స్థానిక ఎన్నికలకు షెడ్యూల్ విడుదల
  ఏప్రిల్ 6న జెడ్పీటీసీ, ఎంపీటీసీల ఎన్నికలు
  అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన జడ్పీ అధికారులు
  ఎన్నికల బడ్జెట్ రూ.8 కోట్లు కేటాయింపు
 
 సాక్షి, గుంటూరు: ప్రాదేశిక పోరుకు నోటిఫికేషన్ విడుదలైంది. నామినేషన్లు, ఎన్నికల ప్రక్రియ తేదీలను వెల్లడిస్తూ షెడ్యూల్ ప్రకటించారు. ఇప్పటికే జెడ్పీ అధికారులు ఎన్నికలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేశారు. పోలింగ్ కేంద్రాల గుర్తింపు, అధికారుల విధులు ఇలా సర్వం సిద్ధం చేశారు.
 
 స్థానిక ఎన్నికలకు జిల్లా పరిషత్ సీఈవో కీలకంగా వ్యవహరిస్తారు.
 ప్రత్యేకాధికారిగా జిల్లా కలెక్టరు వ్యవహరిస్తారు. ఆయన అనుమతితో రిటర్నింగ్ అధికారులు, మండలాల్లో ప్రత్యేక అధికారులు విధులు నిర్వహించే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. 
 
 ఈ ఎన్నికల ఏర్పాట్లపై మంగళవారం 
 పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
 ఈ ఎన్నికల్లో ఈవీఎంల వినియోగం ఉండదు. రెండు రంగులతో కూడిన బ్యాలెట్ పేపర్లు వినియోగించనున్నారు. వీటిని గుంటూరులోనే ముద్రించనున్నారు.
  ఎన్నికలకు అవసరమయ్యే నిధులకు 2014-15 జెడ్పీ బడ్జెట్‌లో రూ.8 కోట్లు కేటాయించారు. 
 
 జడ్పీటీసీ నామినేషన్లు జడ్పీలో.. 
 ఎంపీటీసీ నామినేషన్లు ఆయా మండలాల్లోనే..
 ప్రాదేశిక ఎన్నికలకు ఈ నెల 17 నుంచి నామినేషన్ల స్వీకరణ కార్యక్రమం మొదలు కానుంది. జెడ్పీటీసీకి నామినేషన్లు గుంటూరులోని జెడ్పీ కార్యాలయంలో సమర్పించాల్సి ఉంటుంది.
 ఎన్నికల రిటర్నింగ్ అధికారి కలెక్టరు ఆధ్వర్యంలో జేసీ, జిల్లా అధికారులు నామినేషన్ల కార్యక్రమంలో కీలకంగా వ్యవహరిస్తారు.
  ఎంపీటీసీలకు సంబంధించి ఆయా మండలాల్లోనే నామినేషన్లు సమర్పించాలి. జిల్లా అధికారులను రిటర్నింగ్ అధికారులుగా నియమించి వారి పర్యవేక్షణలో ఎన్నికల ప్రక్రియ నిర్వహించనున్నారు. 
 మంగళవారం రిటర్నింగ్ అధికారులను నియమించనున్నారు. 
 
 ఎంపీడీవోలకు కత్తి మీద సామే.. 
 సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఇతర జిల్లాల నుంచి ఎంపీడీవోలు బదిలీపై ఈ జిల్లాకు వచ్చారు. అయితే ఒక్కసారిగా ప్రాదేశిక ఎన్నికలు రావడంతో వీరికి విధి నిర్వహణ కత్తి మీద సాములా మారనుంది. జిల్లాకు 43 మంది కొత్త కావడం ఆయా మండలాల్లో వీరు ఈ తరుణంలో కీలకంగా వ్యవహరించాల్సి ఉంది. దీంతో ఎంపీడీవోలు ఈ ఎన్నికలపై తలలు పట్టుకుంటున్నారు. పైగా ఎన్నికలకు ముందుగానే వీరు ఆయా పనుల నిమిత్తం ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఎన్నికల బడ్జెట్ కేటయించారే గానీ ఇప్పటివరకు మండలాలకు నిధులు కేటాయించలేదు.   
 
 నామినేషన్ల స్వీకరణ : మార్చి 17 నుంచి 20 వరకు
 పరిశీలన : మార్చి 21
 అభ్యంతరాల స్వీకరణ, తిరస్కరణ : మార్చి 22, 23
 ఉపసంహరణ : మార్చి 24
 పోలింగ్  తేదీ : ఏప్రిల్ 6
 రీ పోలింగ్ అవసరమైతే : ఏప్రిల్ 7
 ఓట్ల లెక్కింపు : ఏప్రిల్ 8
 

Advertisement

తప్పక చదవండి

Advertisement