నదిలోకి దూకిన ప్రేమజంట | Sakshi
Sakshi News home page

నదిలోకి దూకిన ప్రేమజంట

Published Sat, May 12 2018 6:51 PM

Lovers Jumps Into Vynatheya River - Sakshi

సాక్షి, పాశర్లపూడి: పెద్దలు తమ పెళ్లికి నిరాకరించారన్న కారణంతో యువజంట తూర్పుగోదావరి జిల్లా మామిడికుదురు మండలం పాశర్లపూడి గ్రామ పరిధిలోని వైనతేయ వారధి పైనుంచి గోదావరి నదిలో దూకి శనివారం ఆత్మహత్యకు పాల్పడింది. జంటలో యువకుడి మృతదేహం లభ్యమైంది. యువతి ఆచూకీ కోసం మత్స్యకారుల సహాయంతో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

నగరం గ్రామానికి చెందిన యెలిశెట్టి నాగశివదుర్గ (21) ప్రైవేటు ఎలక్ట్రీషియన్‌గా పని చేస్తున్నాడు. పెదపట్నం గ్రామానికి చెందిన 14 ఏళ్ల ముత్యాల నాగ సుజిత తొమ్మిదో తరగతి చదువుతోంది. నగరంలోని అమ్మమ్మ ఇంటి వద్ద ఉంటూ అదే గ్రామంలోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో చదువుకుంటోంది. వీరిద్దరూ కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. విషయం రెండు కుటుంబాల పెద్దలకు తెలియడంతో ఇద్దరినీ మందలించారు. ఈ పరిణామాల నేపథ్యంలో బంధువుల ఇంటికి వెళ్తున్నానని చెప్పిన సుజిత పెదపట్నంలోని తన ఇంటి నుంచి సైకిల్‌పై బయటకొచ్చింది. మోటార్‌ సైకిల్‌పై వచ్చిన నాగశివదుర్గ తనను ఎక్కించుకుని పాశర్లపూడి వచ్చి వైనతేయ వారధిపై నుంచి గోదావరి నదిలోకి దూకి అత్మహత్యకు పాల్పడ్డారు.

మోటార్‌ సైకిల్‌లో సెల్‌ఫోన్, కొంత నగదు, చాక్లెట్‌ ప్యాకెట్లు ఉన్నాయి. గమనించిన స్థానికులు మోటార్‌ సైకిల్‌లో ఉన్న సెల్‌ఫోన్‌ నుంచి వారి కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. యువతి తండ్రి నర్సింహమూర్తి, తల్లి కనకదుర్గ, యువకుడి తండ్రి రాము, తల్లి కుమారి, వారి కుటుంబసభ్యులు ఘటనాస్థలికి చేరుకొని తీవ్రంగా విలపించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మత్స్యకారుల సహాయంతో గోదావరి నదిలో గాలింపు చర్యలు చేపట్టారు. యువకుని మృతదేహం లభ్యమైంది. యువతి ఆచూకీ కోసం గాలిస్తున్నారు. 

Advertisement
Advertisement