మడకశిరలో లాకప్ మరణం | Sakshi
Sakshi News home page

మడకశిరలో లాకప్ మరణం

Published Wed, Jul 2 2014 3:00 AM

మడకశిరలో లాకప్ మరణం - Sakshi

మడకశిర: అనంతపురం జిల్లా మడకశిర పోలీస్‌స్టేషన్‌లో మంగళవారం లాకప్ డెత్ జరిగింది. మడకశిర మండలం కల్లుమర్రి గ్రామానికి చెందిన బషీర్ (35) లాకప్‌లో మరణించాడు. విషయం తెలియగానే మృతుడి కుటుంబ సభ్యులు, బంధువులు పెద్ద సంఖ్యలో పోలీస్ స్టేషన్ ముందు ఆందోళనకు దిగారు. స్థానిక ఎస్‌ఐ సద్గురుడు, మరో నలుగురు కానిస్టేబుళ్లు కలిసి బషీర్‌ను కొట్టి చంపారని ఆరోపించారు. తీవ్రతను గమనించిన ఎస్‌ఐ, కానిస్టేబుళ్లు అక్కడి నుంచి ఉడాయించారు.

గత నెల 12న మడకశిరలో 20 టన్నుల ఐరన్ రాడ్ల అపహరణ కేసులో బషీర్‌ను సోమవారం రాత్రి పోలీసులు అరెస్ట్ చేశారు. అదే రోజు అర్ధరాత్రి బషర్ లాకప్‌లో ఉరి వేసుకున్నాడని పోలీసులు తెలిపారు. అయితే.. బషీర్‌ను పోలీసులు గత శుక్రవారమే స్టేషన్‌కు తీసుకొచ్చినట్లు కుటుంబ సభ్యుల కథనం. కాగా, అనంతపురం ఎస్పీ సెంథిల్‌కుమార్ మడకశిర ఎస్‌ఐ సద్గురుడుతో పాటు ముగ్గురు కానిస్టేబుళ్లను సస్పెండ్ చేశారు.
 

Advertisement
Advertisement