మహా ఏర్పాట్లు | Sakshi
Sakshi News home page

మహా ఏర్పాట్లు

Published Tue, Feb 11 2014 4:13 AM

Mahajataralo million pilgrims

కలెక్టరేట్, న్యూస్‌లైన్ : మహాజాతరలో కోటి మంది భక్తులు సమ్మక్క, సారలమ్మను దర్శించుకునే విధంగా ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కలెక్టర్ జి.కిషన్ తెలిపారు. ఇప్పటికే 25లక్షల మంది భక్తులు అమ్మవార్లను దర్శించుకున్నారని చెప్పారు. మేడారం ఏర్పాట్లపై కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో సోమవారం ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈనెల 12 నుంచి 15వ తేదీ వరకు రద్దీ ఎంత ఉన్నా ప్రతీ భక్తుడు ప్రశాంతంగా దర్శనం చేసుకుని తిరిగి వెళ్లేలా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసిందన్నారు. రోడ్లు వెడల్పు చేయడం వల్ల రాకపోకలకు ఎలాంటి ఇబ్బందులు ఉండవన్నారు. జాతర పరిసర ప్రాంతాల్లో కూడా భక్తుల రద్దీకి తగ్గట్లు విస్తరణ పనులు చేసినట్లు తెలిపారు. దర్శనం తర్వాత బయటకు వచ్చేందుకు రెండు దారులు ఏర్పాటు చేసినట్లు ఆయన వివరించారు.
 
భక్తులకు అమ్మవార్ల ప్రసాదం
 
అమ్మవార్ల దర్శనం అనంతరం భక్తులు బయటకు వచ్చే మార్గంలో ప్రసాదం అందించేందుకు కౌంటర్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రత్యేక సిబ్బంది సుమారు 40 వరకు కౌంటర్ల ద్వారా ప్రసాదం అందిస్తారన్నారు. క్యూలైన్లలో నిలబడే భక్తుల కోసం మంచినీటి సౌకర్యం కల్పిస్తున్నామని తెలిపారు. జాతరలో మంచి నీటిని పూర్తిస్థాయిలో క్లోరినేషన్ చేసి అందజేస్తున్నామని చెప్పారు.
 
 
మరుగుదొడ్ల నిర్మాణం
 
జాతరలో భక్తుల అవసరాలకు తగ్గట్లు టాయిటెట్ల నిర్మాణం చేపట్టినట్లు తెలిపారు. వీటితోపాటు జనం ఎక్కువ సంఖ్యలో గుడారాలు ఏర్పరుచుకున్న చోట మొబైల్ టాయిలెట్స్ అందుబాటులో ఉంచేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు వివరించారు. పారిశుద్ధ్యం విషయంలో అధికారులు పూర్తిస్థాయిలో అప్రమత్తంగా ఉండాలని ఆదేశించినట్లు తెలిపారు.
 
మద్యం అమ్మకాలపై నజర్
 
జాతరలో 22 మద్యం దుకాణాల ఏర్పాటుకు అ నుమతి ఇచ్చామన్నారు. మద్యం వ్యాపారులు అడ్డగోలుగా ధరలు పెంచకుండా, సిండికేట్ వ్యాపారంతో ఇబ్బందులు లేకుండా ఉండేం దుకు బృందాలు ఏర్పాటు చేస్తున్నా మన్నారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యాపారం చేస్తే లెసైన్స్ రద్దు చేస్తామని కలెక్టర్ స్పష్టం చేశారు.
 
సూపర్ స్పెషాలిటీ వైద్యం
 
మేడారంలోని 60 పడకల ఆస్పత్రిలో సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందించనున్నట్లు తెలి పారు. వైద్యాధికారులు, సిబ్బంది 24 గంటలు అందుబాటులో ఉంటారని, 104 వాహనం సంచార వైద్య సేవలు అందిస్తుందన్నారు. మేడారం జాతరలో ప్లాస్టిక్ కవర్లను పూర్తిస్థాయిలో నిషేధించడానికి తగిన చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు. అధికారులు ప్రత్యేక బృందాలుగా దాడులు చేసి కేసులు నమోదు చేస్తారన్నారు.
 
 ఆటోలకు అనుమతి లేదు

 మేడారం వెళ్లే రహదారులు విస్తరించి ఉన్నందున వాహనాలు వేగంగా వచ్చే అవకాశం ఉం దని, అలాంటి సమయంలో ఆటోలతో ఇబ్బందులు ఎదురవుతాయని, దీంతో మంగళవారం నుంచి జాతర ముగిసే వరకు మేడారం వెళ్లేందుకు ఆటోలను అనుమతించమని వరంగల్ రూరల్ ఎస్పీ లేళ్ల కాళిదాసు తెలిపారు. ద్విచక్ర వాహనాలపై ప్రయాణం కూ డా ఇబ్బందికరమేనని, ఈ విషయంలో వాహనదారులే నిర్ణయం తీసుకోవాలని అన్నారు. జాతరకు సంబంధించి ప్రధానమైంది ట్రాపిక్ సమస్య అని, దానిని అదిగమించేందుకు పక్కా ప్రణాళిక సిద్ధం చేసినట్లు వివరించారు. వీఐపీ, వీవీఐపీ పార్కింగ్ కోసం 24 స్థలాలు ఏర్పాటు చేశామని, అ డ్డంగా ఉన్న వాహనాలను తొలగించేందుకు నాలుగు క్రేన్లు, జేసీబీలు సిద్ధంగా ఉంచామన్నారు.
 
 డ్రైవర్లు మద్యం తాగొద్దు


 జాతరకు వాహనాలు తీసుకొచ్చే డ్రైవర్లు ఎట్టి పరిస్థితుల్లోనూ మద్యం సేవించి వాహనాలు న డపొద్దని అన్నారు. జంగాలపల్లి, పస్రాతోపాటు మరికొన్ని చోట్ల ప్రత్యేక పోలీసు గస్తీ బృందాలు బ్రీతింగ్ అనలైజర్స్‌తో పరీక్షలు చేస్తారని, డ్రైవర్లు తాగినట్లు గుర్తిస్తే వాహనం అక్కడే నిలిపివేస్తామని తెలిపారు. రాత్రి సమయంలో డ్రైవింగ్ చేసేవారికి నిద్రమత్తు తొలగించేందుకు పస్రాతోపాటు కొన్నిచోట్ల ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి ఐస్‌లో తడిపిన కాటన్ ఇవ్వనున్నట్లు చెప్పారు. చల్లని బట్టతో కళ్లు తుడుచుకోవడం వల్ల మరో 40 కిలోమీటర్ల వరకు నిద్రమత్తు రాకుండా ఉంటుందని అన్నారు. ఇది ఈసారి ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేస్తున్నామని వివరించారు.
 

Advertisement
Advertisement