అత్తవారింటికి వెళ్తూ తిరిగిరాని లోకాలకు | Sakshi
Sakshi News home page

అత్తవారింటికి వెళ్తూ తిరిగిరాని లోకాలకు

Published Tue, Aug 6 2013 1:29 AM

Man dies in Road accident at kisara


 కీసర, న్యూస్‌లైన్ : భార్యాపిల్లలను తీసుకొచ్చేందుకు అత్తవారింటికి వెళ్తున్న ఓ వ్యక్తి మార్గంమధ్యలో మృత్యువాత పడ్డాడు. రోడ్డుపై వెళ్తున్న బైకును రివర్స్ తీసుకుంటున్న లారీ వేగంగా ఢీకొనడంతో తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. ప్రమాదంలో మరొకరికి గాయాలయ్యాయి. ఈ సంఘటన సోమవారం మధ్యాహ్నం కీసర ఠాణా పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. నల్లగొండ జిల్లా బొమ్మలరామారం మండలం జలాల్‌పురం గ్రామానికి చెందిన జి. జనార్దన్‌గౌడ్ (45) కొన్ని ఏళ్ల క్రితం కీసర గ్రామానికి కుటుంబంతో వలస వచ్చి ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాడు. సోమవారం మధ్యాహ్నం జనార్దన్‌గౌడ్ భార్యాపిల్లలను తీసుకురావడానికి తన మిత్రుడు రాముగౌడ్ తో కలిసి బైకుపై అత్తవారిల్లు  కుందన్‌పల్లికి వెళ్తున్నాడు.
 
 ఈక్రమంలో కుందన్‌పల్లి చౌరస్తా దాటి గ్రామంలోకి వెళ్తుండగా రోడ్డు పనుల్లో ఉన్న ఓ టిప్పర్ వేగంగా రివర్స్ వస్తూ ఈయన బైకును ఢీకొంది. ప్రమాదంలో జనార్దన్‌గౌడ్ అక్కడికక్కడే దుర్మరణం చెందగా ఆయన స్నేహితుడు రాముగౌడ్ రెండు కాళ్లు విరిగిపోయి తీవ్రంగా గాయపడ్డాడు. కాగా లారీ డ్రైవర్ నిర్లక్ష్యంతోనే ప్రమాదం జరిగిందని మృతుడి బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రోడ్డుపనుల్లో భాగంగా వాహనాల రాకపోకలు సూచించేందుకు సిబ్బందిని ఉంచాల్సి ఉన్నా కాంట్రాక్టర్ ఆదిశగా చర్యలు చేపట్టలేదని మండిపడ్డారు. జనార్దన్‌గౌడ్ రాకకోసం ఎదురు చూస్తున్న బంధువులు ఆయన మృతి వార్త విని నిర్ఘాంతపోయారు. భార్యాపిల్లల రోదనలు మిన్నంటాయి. ఘటనా స్థలానికి బంధువులు పెద్దమొత్తంలో చేరుకున్నారు. క్షతగాత్రుడు రాముగౌడ్‌ను చికిత్స నిమ్తితం నగరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.  కేసు దర్యాప్తు చేస్తున్నట్లు కీసర సీఐ కృష్ణకిషోర్ తెలిపారు.

Advertisement
Advertisement