డబ్బుల కోసం కిడ్నాప్, హత్య | Sakshi
Sakshi News home page

డబ్బుల కోసం కిడ్నాప్, హత్య

Published Sun, Mar 22 2015 10:08 PM

Man kidnapped, murdered for money giving delay

ఓబులవారిపల్లె(వైఎస్సార్ జిల్లా) : ఓ వ్యక్తిని కిడ్నాప్ చేసి రూ.20లక్షలు డబ్బులు డిమాండ్ చేసి డబ్బులు అందకపోవడంతో అతి కిరాతకంగా పెట్రోల్ పోసి తగలబెట్టిన సంఘటన ఓబులవారిపల్లె మండలంలో ఆదివారం వెలుగు చూసింది. వైఎస్సార్ జిల్లా రైల్వేకోడూరు పట్టణానికి చెందిన సిరిపిరెడ్డి నాగసుబ్బారెడ్డి(55) అనే వ్యక్తికి అదే పట్టణానికి చెందిన ప్రసాద్, బాషా అనే ఇరువురు డ్రైవర్లతో పది రోజుల క్రితం ఓ మద్యం దుకాణం వద్ద పరిచయం ఏర్పడింది. ఈ నేపథ్యంలో గురువారం వారు నాగసుబ్బారెడ్డికి ఫోన్ చేసి రైల్వేకోడూరులోని లక్ష్మీప్యారడైజ్ వద్దకు రమ్మని కోరారు. అక్కడకు వెళ్లగానే ముందుగానే సిద్ధం చేసుకున్న ఓ కారులో రైల్వేకోడూరు సమీపంలోని అటవీ ప్రాంతానికి తీసుకెళ్లారు.

కిడ్నాప్‌కు గురైన నాగసుబ్బారెడ్డి ఫోన్‌నుంచే అతని కుమారుడు హర్షవర్దన్‌రెడ్డికి ఫోన్ చేసి మీ తండ్రిని కిడ్నాప్ చేశాం. రూ. 20 లక్షలు ఇస్తే వదిలేస్తామని డిమాండ్ చేశారు’. అంత పెద్ద మొత్తంలో వారు డబ్బులు సమకూర్చలేక పోయేసరికి పెట్రోల్ పోసి అతి కిరాతకంగా నాగసుబ్బారెడ్డిని హతమర్చారు. తమ తండ్రి ఆచూకీ తెలియకపోవడంతో అతని కుమారుడు, బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సెల్‌ఫోన్ టవర్ ఆధారంగా నిందితులను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. వారిచ్చిన సమాచారం మేరకు ఓబులవారిపల్లె - కష్ణపట్నం రైల్వేలైను పనులు జరుగుతున్న ఎల్లాయపల్లె సమీపంలో నాగసుబ్బారెడ్డిని కాల్చి చంపిన ఆనవాళ్లను పోలీసులు గుర్తించారు. డబ్బుల కోసం కిడ్నాప్ చేసి హతమార్చడం హేయమైన చర్య అని రైల్వేకోడూరు ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు ఖండించారు.

Advertisement
Advertisement