పసిమొగ్గపై దారుణం | Sakshi
Sakshi News home page

పసిమొగ్గపై దారుణం

Published Sun, Jul 23 2017 6:51 AM

పసిమొగ్గపై దారుణం - Sakshi

∙శవమై కనిపించిన కిడ్నాపైన బాలిక
∙ఐదేళ్ల చిన్నారిపై కామాంధుడి అకృత్యం
∙లైంగిక దాడికి పాల్పడి.. ఆపై హత్య చేసిన వైనం
.పీసీపల్లి మండలం పెద ఇర్లపాడులో దారుణం

పీసీపల్లి (కనిగిరి) : మృగాడి అకృత్యానికి ఓ పసిమొగ్గ రాలిపోయింది. రెండ్రోజుల కిందట కిడ్నాపైన ఐదేళ్ల చిన్నారి నిర్మానుష ప్రదేశంలో శవమై కనిపించింది. అపహరణకు గురైన కన్నబిడ్డ ఆచూకీ లభించక పుట్టెడు దుఃఖంలో ఉన్న తల్లిదండ్రులకు గర్భం శోకం మిగిలింది. అన్నెం పున్నెం ఎరుగని బాలికను ఓ మానవ మృగం చిత్ర హింసలు పెట్టి.. లైంగిక దాడికి ఒడిగట్టి చివరికి ప్రాణాలు తీశాడు. ఈ అమానవీయ ఘటన పీసీపల్లి మండలంలో శనివారం సాయంత్రం వెలుగుచూసింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... నెల్లూరు జిల్లా రాపర్ల మండలం గుండువల్లి గ్రామానికి చెందిన బ్రహ్మయ్య, పుష్ప దంపతులు ఏడు నెలల కిందట ప్రకాశం జిల్లా పీసీపల్లి మండలంలోని కోదండ రామాపురానికి వచ్చారు. గ్రామానికి చెందిన వేమూరి మాల్యాద్రి పొలంలోని తోటల్లో కాపలాగా జీతానికి ఉంటున్నారు. వీరికి ఐదేళ్ల కుమార్తె సియోని కుమారి ఉంది. ఈ నెల 20న బాలికకు కడుపు నొప్పి రావడంతో వైద్యం కోసం తండ్రి సమీపంలోని పెద ఇర్లపాడు గ్రామానికి తీసుకొచ్చాడు. అక్కడి ఆర్‌ఎంపీ వద్ద సూది మందు వేయించుకునేందుకు బాలిక నిరాకరించడంతో మాత్రలు తీసుకున్నాడు.

ఇంటికి బయలుదేరుతున్న బ్రహ్మయ్యను ఓ అపరిచిత వ్యక్తి మాట కలిపి పరిచయం చేసుకోసాగాడు. స్థానికుల పేర్లు చెప్పి వారు తనకు తెలుసునని, వారు తనకు బంధువులేనని నమ్మబలికాడు. అప్పటికే మద్యం తాగి ఉన్న ఆ వ్యక్తి బ్రహ్మయ్యకు రూ.200 ఇచ్చి మద్యం తాగుదాం తీసుకురమ్మని పురమాయించాడు. పాపను అతడి వద్ద వదలి దుకాణానికి వెళ్లాడు. మద్యం షాపు మూసివేసి ఉండడంతో తిరిగొచ్చిన తండ్రికి అక్కడ కుమార్తె సహా ఆ వ్యక్తి కనిపించలేదు. చుట్టుపక్కల వారిని విచారించినా తెలియదనడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులకు రెండు రోజులుగా బాలిక ఆచూకీ లభించలేదు.
 
పశుకాపరి కంటపడిన బాలిక శవం..
శనివారం సాయంత్రం పెద ఇర్లపాడు సమీపంలోని చెరువులోకి పశువులు వెళ్లగా వాటిని తోలుకొచ్చేందుకు వెళ్లిన కాపరికి అక్కడ చిల్లచెట్ల మధ్య పాప శవం కనిపించింది. పరుగున వచ్చి విషయాన్ని గ్రామస్తులకు చెప్పాడు. సమాచారం అందుకున్న పోలీసులు బాలిక మృతదేహాన్ని పరిశీలించారు. ఘటనాస్థలంలో ఆధారాలను సేకరించారు.  ఘటనాస్థలంలో నిందితుడి చెప్పులు, బాలిక కోసం తీసుకున్న టిఫిన్‌ పొట్లాల కవర్‌ పడిఉన్నాయి. కందుకూరు డీఎస్పీ ప్రకాష్‌రావు మాట్లాడుతూ చిన్నారి సియోనిని మానభంగం చేసి, క్రూరంగా హత్యచేశారని తెలిపారు. చెవి కమ్మలు, గొలుసు కూడా అపహరించినట్టు చెప్పారు. నిందితుడు ఈ ప్రాంతానికి పలుమార్లు వచ్చినట్టు తెలిసిందని, అతడి సంబంధీకులు ఈ ప్రాంతంలో ఉన్నారని తెలిపారు. విచారించి, త్వరలోనే నిందితుడిని పట్టుకుంటామన్నారు. డీఎస్పీ వెంట సీఐ సుబ్బారావు, ఎస్‌ఐ రామక్రిష్ణ ఉన్నారు.

ఎంత ఘోరం ఒడిగట్టాడో..
రెండు రోజులుగా కుమార్తె కనిపించక తీవ్ర శోకంలో మునిగిపోయిన బ్రహ్మయ్య, పుష్ప దంపతులు కన్న బిడ్డ ఇక లేదని తెలిసి గుండెలు బాదుకున్నారు. పాత చెరువులో బాలిక మృతదేహం ఉన్నట్టు తెలుసుకున్న స్థానికులు పెద్ద సంఖ్యలో ఘటనాస్థలికి చేరుకున్నారు. అక్కడి పరిస్థితి, మృతదేహం పడి ఉన్న తీరును చూసి చలించి పోయారు. అన్నెం పుణ్యం తెలియని ఐదేళ్ల బాలికను ఆ పాపాత్ముడెవరో ఘోరంగా.. అతి దారుణంగా చంపేశాడని ఆవేదన వ్యక్తం చేశారు. నిందితుడిని పట్టుకుని కఠినంగా శిక్షించాలని పోలీసు అధికారులను వేడుకొన్నారు.

కన్నకూతుర్ని బలితీసుకున్న మద్యం మత్తు..
అనారోగ్యంతో బాధపడుతున్న కుమార్తెను కంటికి రెప్పలా చూసుకోవాల్సిన తండ్రి ఎవరో అనామకుడు మద్యం తాగుదామని ఆశ చూపడంతో తన బాధ్యత విస్మరించాడు. ఐదేళ్ల బాలికను గుర్తుతెలియని వ్యక్తికి అప్పగించి, మద్యం కోసం వెంపర్లాడాడు. అతడి నిర్లక్ష్యం కారణంగానే కన్నబిడ్డ హింసలకు గురై మరణించింది.

Advertisement
Advertisement