భార్యను రైల్లోంచి తోసేసిన భర్త | Sakshi
Sakshi News home page

భార్యను రైల్లోంచి తోసేసిన భర్త

Published Thu, May 18 2017 12:54 AM

భార్యను రైల్లోంచి తోసేసిన భర్త

ప్రకాశం జిల్లా కడవకుదురు వద్ద ఘటన

చీరాల/రైల్వేస్టేషన్‌(విజయవాడ): భార్య ఎవరితోనో ఫోన్‌లో మాట్లాడుతోందనే విషయంపై వాదులాటకు దిగిన భర్త, వేగంగా వెళ్తున్న రైలు నుంచి ఆమెను కిందికి తోసి హతమార్చాడు. ఈ ఘటన బుధవారం ప్రకాశం జిల్లా చీరాల జీఆర్పీ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని కడవకుదురు వద్ద జరిగింది. బిహార్‌కు చెందిన అషితోష్‌కుమార్, అల్పన(23) దంపతులు చెన్నైలోని ఓ రొయ్యల హ్యాచరీలో పనిచేస్తున్నారు. వీరు బిహార్‌కు వెళ్లేందుకు బుధవారం చెన్నై నుంచి ఢిల్లీ వెళ్లే తమిళనాడు ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణిస్తున్నారు. వీరితో పాటు అషితోష్‌ స్నేహితుడు ధర్మకుమార్‌ ఉన్నాడు. రిజర్వేషన్‌ చేయించుకున్నప్పటికీ వారి సీట్లలో కాకుండా డోర్‌ దగ్గర కూర్చున్నారు. అల్పన ఎక్కువగా ఫోన్‌ మాట్లాడుతోందనే విషయమై దంపతులు చెన్నైలో రైలెక్కినప్పటి నుంచీ వాదులాడుకుంటూనే ఉన్నారు.

బుధవారం రైలు కడవకుదురు రైల్వేస్టేషన్‌ సమీపం రాగానే ఎవరూ తమను గమనించడం లేదని భావించిన అషితోష్‌కుమార్, ధర్మకుమార్‌ అల్పనను రైలు నుంచి తోసేయడంతో తీవ్రగాయాలపాలై మృతి చెందింది. వీరికి పదినెలల క్రితమే వివాహం కాగా మద్యానికి బానిసైన భర్త అల్పనపై అనుమానం పెంచుకుని  హింసిస్తూ ఉండేవాడు. హత్యను చూసిన తోటి ప్రయాణికులు, టీసీ ఇచ్చిన సమాచారంతో విజయవాడలో  నిందితులను జీఆర్పీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.  కడవకుదురు రైల్వేస్టేషన్‌ సమీపంలో రైలు పట్టాలపై పడిఉన్న అల్పన మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం చీరాల ఏరియా వైద్యశాలకు తరలించారు. చీరాల వెళ్లి మృతదేహాన్ని పరిశీలించిన జీఆర్పీ ఒంగోలు సీఐ టి.శ్రీనివాసరావు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
Advertisement