ఆదరణ నిధులు పక్కదారి  | Sakshi
Sakshi News home page

ఆదరణ నిధులు పక్కదారి 

Published Sun, Aug 4 2019 4:11 AM

Massive robbery of equipments During the TDP government - Sakshi

సాక్షి, అమరావతి: గత ప్రభుత్వ హయాంలో ఆదరణ పథకం కింద బీసీల్లో ఉన్న కుల వృత్తుల వారికి పరికరాలు ఇప్పించే విషయంలో తెలుగుదేశం పార్టీ నేతలు భారీగా దోచుకున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.  4 లక్షల మంది బీసీలకు పరికరాలు కొనుగోలు చేసి, అందజేస్తామని టీడీపీ ప్రభుత్వం హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. దీనికోసం రూ.850 కోట్లు కేటాయించింది. ఈ సొమ్ము పక్కదారి పట్టిందని లబ్ధిదారులు వాపోతున్నారు. 2.5 లక్షల మందికి పరికరాలు పంపిణీ చేశామని చెబుతున్నా చాలామందికి అవి అందలేదు. పరికరాలు ఇవ్వకపోగా, లబ్ధిదారుల వాటా కింద కట్టించుకున్న మొత్తాన్ని వారికి తిరిగి ఇవ్వలేదు.

ఇలా తమ వాటా కింద డబ్బులు చెల్లించిన వారు 70 వేల మంది ఉన్నారని అధికారులు చెబుతున్నారు. ఆదరణ పథకం కింద 8 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా, టీడీపీ ప్రభుత్వం కేవలం 2.5 లక్షల మందికి నాసిరకం పరికరాలు ఇచ్చి చేతులు దులుపేసుకుంది. గోడౌన్‌లలో ప్రస్తుతం వృథాగా పడి ఉన్న పరికరాల పరిస్థితి ఏమిటనేది ప్రశ్నార్థకంగా మారింది. ఈ పరికరాలను లబ్ధిదారులకు పంపిణీ చేయాలని ప్రభుత్వానికి ప్రతిపాదన పంపించామని, ప్రభుత్వం నుంచి వచ్చే ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటామని అధికారులు చెబుతున్నారు.   

Advertisement
Advertisement