'సేవ్ ఆంధ్రప్రదేశ్'కు సంఘీభావంగా స్తంభించిన వైద్య సేవలు | Sakshi
Sakshi News home page

'సేవ్ ఆంధ్రప్రదేశ్'కు సంఘీభావంగా స్తంభించిన వైద్య సేవలు

Published Sun, Sep 8 2013 1:13 AM

Medical services stalled in support of 'Save Andhrapradesh'

విశాఖపట్నం-మెడికల్, న్యూస్‌లైన్: ఆంధ్ర వైద్య కళాశాల అనుబంధ ప్రభుత్వ ఆస్పత్రులలో శనివారం ఓపీల్లో వైద్యసేవలు, సాధారణ శస్త్ర చికిత్సలు నిలిచిపోయాయి. సమైక్యాంధ్ర పరిరక్షణ కోసం ఎన్జీవోలు హైదరాబాద్‌లో నిర్వహించిన సేవ్ ఆంధ్రప్రదేశ్ బహిరంగ సభకు సంఘీభావంగా వైద్యులు కేజీహెచ్‌తోపాటు విక్టోరియా ప్రసూతి ఆస్పత్రి, ఈఎన్‌టీ, కంటి, ఛాతి, రాణి చంద్రమణిదేవి, వికలాంగుల ఆస్పత్రుల్లో కేవలం అత్యవసర శస్త్ర చికిత్సలు, ప్రసవాలు మాత్రమే జరిగాయి.

ఓపీ చీటీలనిచ్చే కౌంటర్లు తెరుచుకోలేదు. ఓపీ విభాగాలకు వైద్యులు రాకపోవడంతో ఆయా గదుల తాళాలు తీయలేదు. శస్త్ర చికిత్సలకు సంబంధించి ఎమర్జెన్సీ ఆపరేషన్ థియేటర్‌లలో అత్యవసర శస్త్ర చికిత్సలు మాత్రమే జరిగాయి. అత్యవసర రోగులను క్యాజువాల్టీలో చూశారు. ఆపరేషన్ థియేటర్‌లు తెరుచుకోకపోవడంతో ఎలక్టివ్ సర్జరీలు ఏమి జరగలేదు. కేజీహెచ్‌లో ఒక ఎమర్జెన్సీ ఆపరేషన్ థియేటర్, గైనిక్ లేబర్ రూమ్ మినహా అన్ని ఆపరేషన్ థియేటర్‌లకు తాళాలు వేసి కనిపించాయి.

దూరప్రాంతాల నుంచి వచ్చిన రోగులు వైద్యసేవలు అందకపోవడంతో తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. నిరాశతో ప్రైవేటు ఆస్పత్రులకు పరుగులు తీశారు. కొంతమంది అత్యవసర వై ద్య విభాగాల ముందు పడిగాపులు కాశారు. వార్డుల్లోనూ వైద్యసేవలకు కొంతమేరకు అంతరాయం కలిగిం ది. యూనిట్‌కు ఒక వైద్యుడు, పీజీలు మాత్రమే అందుబాటులో ఉన్నారు. ప్రధానంగా నాలుగో తరగతి ఉద్యోగులు ఎక్కువమంది విధులకు గైర్హాజరై సమైక్యాంధ్ర నిరసన ధర్నాలో పాల్గొన్నారు.
 
 

Advertisement
Advertisement