టీడీపీ మోసాలను గమనించాలి | Sakshi
Sakshi News home page

టీడీపీ మోసాలను గమనించాలి

Published Sun, Jul 8 2018 10:18 AM

MLA Amjad Basha Comments On TDP YSR Kadapa - Sakshi

కడప కార్పొరేషన్‌ : తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం చేస్తున్న మోసాలను ప్రజలు గమనించాలని నగర మేయర్‌ కె. సురేష్‌బాబు, కడప ఎమ్మెల్యే అంజద్‌బాషా తెలిపారు. శనివారం స్థానిక 35వ డివిజన్‌ నకాష్‌లో రూ.20లక్షల బీపీఎస్‌ నిధులతో చేపట్టిన సీసీ రోడ్లకు వారు భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా మేయర్, ఎమ్మెల్యే మాట్లాడుతూ లోతట్టు ప్రాంతమైన నకాష్‌లో వర్షాలు వస్తే అన్ని రోడ్లు, కాలువలు వరదనీటిలో మునిగిపోతుంటాయన్నారు. ఈ పరిస్థితిని గమనించి రోడ్లను ఎత్తు పెంచి నిర్మిస్తున్నామన్నారు. కడప నగరాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం నయాపైసా నిధులు ఇవ్వలేదని, కేంద్ర ప్రభుత్వ నిధులు, కార్పొరేషన్‌ జనరల్‌ఫండ్‌ నుంచే పనులు చేస్తున్నామని చెప్పారు. వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యేలకు ఇవ్వాల్సిన నియోజకవర్గ అభివృద్ధి నిధులు కూడా ఇవ్వకుండా చంద్రబాబు నియంత పాలన సాగిస్తున్నారని ధ్వజమెత్తారు.

నగరంలో తాగునీటి సమస్య నివారణకు అమృత్‌ స్కీం కింద 12 జీఎల్‌ఎస్‌ఆర్‌లు, కొత్త పైపులైన్లు  నిర్మిస్తున్నట్లు చెప్పారు. రాబోయే కాలంలో ప్రతి ఇంటికీ కొళాయి కనెక్షన్‌ ఇస్తామన్నారు. రాబోయే ఎన్నికల్లో వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వం ఏర్పడితే ఆరు మాసాల్లోనే కడపను ఆదర్శ నగరంగా మారుస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు ఎస్‌ఏ షంషీర్‌బాషా, పాకా సురేష్, చైతన్య, రామలక్ష్మణ్‌రెడ్డి, టీపీ వెంకటసుబ్బమ్మ, నాయకులు వీరారెడ్డి, సీహెచ్‌ వినోద్, డి.శివప్రసాద్, కరిముల్లా, షఫీ పాల్గొన్నారు.

Advertisement
Advertisement