ఆలూరు, న్యూస్లైన్: దేవరగట్టులో జరిగిన బన్ని ఉత్సవంలో కొంతమంది అల్లరిమూకలు మూర్ఖంగా ప్రవర్తించారని ఎస్పీ డాక్టర్ కొల్లి రఘురామిరెడ్డి పేర్కొన్నారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రజలు మానప్రాణాలను రక్షిం చేందుకే పోలీసులు ఉన్నారని తెలిపారు. అయితే కొంతమంది పోలీసులకు వ్యతిరేకంగా ప్రవర్తించడం బాధాకరమన్నారు. మాళమల్ల్లేశ్వర స్వాముల ఉత్సవమూర్తుల జైత్రయాత్రకు వెళ్లిన అనంతరం కొందరు భక్తులు పోలీసులపై రాళ్లు రువ్వడం మంచిది కాదన్నారు.
ఎటువంటి ప్రాణనష్టం జరగకూడదన్న ఉద్దేశంతోనే బందోబస్తును ఏర్పాటు చేశాన్నారు. పోలీసులపై రాళ్లు రువ్విన సుళువాయి, విరుపాపురం, నెరణికి, కొత్తపేట తదితర గ్రామస్తులను గుర్తించామన్నారు. వారిపై కేసులు కూడా నమోదు చేసేందుకు స్థానిక సీఐ, స్థానిక ఎస్ఐకు ఆదేశాలు జారీ చేశామన్నారు. కొంతమంది భక్తులు కర్రల సమరంలో ప్రాణహాని జరగకూడదన్న ఉద్దేశంతో హెలిమెంట్లు పంపిణీ చేసినట్లు చెప్పారు. విలేకరుల సమావేశంలో ఏఎస్పీ వెంకటరత్నం, డీఎస్పీ శివరామిరెడ్డి, ఆలూరు సీఐ వెంకటరామయ్య, సిబ్బంది పాల్గొన్నారు.
క్షతగాత్రుల సంఖ్య తగ్గింది
హొళగుంద, న్యూస్లైన్: బన్ని ఉత్సవాల్లో ఈ ఏడాది క్షతగాత్రుల సంఖ్య తగ్గిందని ఎస్పీ రఘురామిరెడ్డి తెలిపారు. మంగళవారం తెల్లవారుజామున బన్ని ఉత్సవాలు ముగిసిననంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. గతేడాది కర్రలు తగిలి 127మంది గాయాలపాలైతే ఈ సంవత్సరం ఆ సంఖ్య 34కు తగ్గిందని తెలిపారు. తమశాఖతోపాటు కొన్ని స్వచ్ఛంద సంస్థలు ఆయా గ్రామాల్లో చేపట్టిన చైతన్య సదస్సులు సత్ఫలితాలు ఇచ్చాయన్నారు. ప్రజలు ఉత్సవాలు ప్రశాంతంగా, సుహృద్భావ వాతావరణంలో విజయవంతంగా జరిగేందుకు తమవంతు సహకారం అందించారని ఆయన వివరించారు. ఉత్సవాలు విజయవంతంగా, ప్రశాంతంగా నిర్వహించేందుకు సహకరించిన అధికారులు, నిర్వాహకులు, ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.