కొడుకు కొడుతున్నాడయ్యా.. | Sakshi
Sakshi News home page

కొడుకు కొడుతున్నాడయ్యా..

Published Sun, Apr 19 2015 2:33 AM

Mother and father

ప్రత్తిపాడు: మండలంలోని వంగిపురం గ్రామానికి చెందిన శిగా ఏసు, నవమ్మ దంపతులకు ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె సంతానం. ఈ వృద్ధ దంపతుల వయసు 80 ఏళ్ల పైమాటే. వారికి ఉన్న ఎకరం పొలం తెగనమ్మి వచ్చిన నగదుతో అప్పులు తీర్చుకుని, మరికొంత వారి శేషజీవితం నిమిత్తం ఉంచుకున్నారు. మిగిలిన సొమ్మును నలుగురు సంతానానికి సమానంగా తలాకొంచెం పంచారు. తమకున్న పది సెంట్ల స్థలంలో ఒక సెంటు భూమి తాము ఉంచుకుని మిగిలిని తొమ్మిది సెంట్లు ముగ్గురు కుమారులకు పంచి ఇచ్చారు. ప్రస్తుతం వీరు పెద్ద కుమారుడు సుభాకరరావు వద్ద తలదాచుకుంటున్నారు.
 
 ఈ పంపకాల విషయం సుభాకరరావు, వృద్ధ దంపతులకు మధ్య మన స్పర్ధలు తలెత్తాయి. తమ వద్ద ఉన్న సెంటు భూమిని కూడా తదనంతరం పెద్దకొడుకుకే రాసిస్తామని చెప్పినా అతడు వినలేడు. తల్లిదండ్రులు దాచుకున్న కొద్దిపాటి డబ్బుతోపాటు ఆ సెంటు స్థలం కూడా తన పేరిట ఇప్పుడే రాసివ్వాలని వేధించడం ప్రారంభించాడు. వృద్ధురాలనే కనికరం కూడా లేకుండా కొడుతున్నాడు. ఈనేపథ్యంలో కొడుకు పెడుతున్న చిత్ర హింసలు భరించలేని ఆ వృద్ధ దంపతులు శనివారం ప్రత్తిపాడు పోలీసులను ఆశ్రయించి తమ గోడును వెల్లబోసుకున్నారు. కొడుకుని స్టేషన్‌కు పిలిపించి, సర్దిచెప్పిన ఎస్‌ఐ కె.వాసు వృద్ధులను అతడి వెంట పంపించారు.
 
 ఇంటికి వెళ్లాక తన బుద్ధి మార్చుకోని సుభాకరరావు పోలీసులకు ఫిర్యాదు చేస్తారా అంటూ ఆగ్రహంతో మళ్లీ ఆ వృద్ధులపై చేయి చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న ఎస్‌ఐ శనివారం రాత్రి వంగిపురం గ్రామానికి వెళ్లి విచారణ చేపట్టారు. గతంలోనూ ఒకసారి పెద్దకొడుకు తల్లిపై చేయి చేసుకోవడంతో అప్పట్లో కూడా పోలీసులను ఆశ్రయించారు. బాధలు భరించలేక రెండో కొడుకు ఇంటికి వెళ్తే వాస్తు ప్రకారం తన ఇంట్లో ఉండకూడదంటూ బయటకు పంపేశాడంటూ ఆ అభాగ్య తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమవుతున్నారు.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement