రిటైరయ్యే వరకు ఎంపీడీఓనేనా..? | Sakshi
Sakshi News home page

రిటైరయ్యే వరకు ఎంపీడీఓనేనా..?

Published Thu, Jun 23 2016 8:01 AM

MPDO To retirement


 జిల్లాలో 38 మండల పరిషత్‌లు ఉన్నాయి. వాటి పరిధిలో 35 మంది ఎంపీడీఓలు విధులు నిర్వహిస్తున్నారు. 2001లో ఎంపీడీఓలుగా చేరిన వారు ఇంకా అదే స్థాయిలో ఉన్నారు. 2007, 2009 గ్రూప్ 1 పాసై ఎంపీడీఓలుగా ఉద్యోగాల్లో చేరిన వారూ అక్కడే ఉన్నారు. పదోన్నతుల విషయంలో ఎంపీడీఓలపై చూపుతున్న నిర్లక్ష్యానికి ఇదే నిదర్శనం. ‘ప్రభుత్వ ఉద్యోగంలో చేరిన తర్వాత సర్వీసు పూర్తయ్యేలోపు రెండు పదోన్నతులు కల్పిస్తాం. పంచాయతీ రాజ్ వ్యవస్థలో పనిచేస్తున్న ఎంపీడీఓలకు పదోన్నతులు కల్పించడానికి టీడీపీ అధికారంలోకి రాగానే జీఓ ఇస్తాం’ అంటూ ఎన్నికల మానిఫెస్టోలో చెప్పినా ఫలితం లేకపోయింది.   

 శ్రీకాకుళం టౌన్ : పంచాయతీ రాజ్ శాఖ పరిధిలో మండల అభివృద్ధి అధికారిగా ఉద్యోగంలో చేరితే సర్వీసు పూర్తయ్యే వరకు అదే సీట్లో ఉండాల్సి వస్తోంది. సర్వీసు కమిషన్ ద్వారా ఉద్యోగంలో చేరినప్పడు మండల స్థాయి అధికారి పోస్టుగదా అని ఎంపీడీఓగా చేరితే ఇక అంతే. తన కంటే కిందిస్థాయిలో ఉన్న వారు పదోన్నతులు పొందుతూ పైకి ఎదిగిపోతుంటే... వీరు మాత్రం అక్కడే ఉండిపోతున్నారు. నిత్యం రాజకీయ ఒత్తిళ్ల మధ్య పనిచేస్తున్నా దానికి తగ్గ ఫలాలు మాత్రం అందుకోలేకపోతున్నారు.

 కీలక బాధ్యతలు...
 జాబ్ చార్టు ఆధారంగా 29 ముఖ్య విధులునిర్వహించే ఎంపీడీఓలకు ప్రభు త్వం నిర్వహించే ప్రతి కార్యక్రమంలోనూ కీలక భాగస్వామ్యం ఉంటుంది. ఏ పార్టీ వారు అధికారంలో ఉన్నా వీరిపై ఒత్తిళ్లు సహజం. మండల స్థాయి అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాల్లో కూడా వీరే కీలకం. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్రాంతి సంబరాలు, నవనిర్మాణ యాత్రలు, ఇతర ప్రచార కార్యక్రమా లూ నిర్వహించారు. పైసా రాల్చకుండా ఈ పనులన్నీ ఎంపీడీఓల చేత చేయిం చుకుంటున్న ప్రభుత్వం వారి పదోన్నుతులు మాత్రం పట్టించుకోవడం లేదు.

 వాహనమూ కరువే...
 మండల పరిషత్ అభివృద్ధి అధికారిగా పనిచేస్తున్న వారికి కనీస వసతులు కూ డా లేవు, జిల్లాలో వారి కంటే దిగువ స్థా యి ఉద్యోగులకు సైతం వాహన యో గం ఉంది. ఐసీడీఎస్ పరిధిలోని సీడీపీఓలకు వాహన సదుపాయాన్ని ప్రభుత్వమే కల్పించింది. వెలుగులో కాం ట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్న ఏపీడీలకు సైతం వాహన సౌకర్యం కల్పించింది. కానీ ఎంపీడీఓలకు మాత్రం వాహనం ఇవ్వడం లేదు. ఎంపీడీలకు పదోన్నతులు కల్పించాలంటే జెడ్పీలో డిప్యూటీ సీఈఓ, ఎంఓ, బీసీ కార్పొరేషన్, ఎస్సీ కార్పొరేషన్, డుమా, డీఆర్‌డీఏ, గిరిజన సంక్షేమ శాఖ అధికారులుగా నియమించే అవకాశాలున్నాయి. అలాగే ఏడీ స్థాయిలో నియామకాలు కల్పించే అవకాశం ఉంటుందని వీరు ఆశ పడుతున్నారు.
 
 అభ్యర్థించినా..
 టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంపీడీఓల పదోన్నతులు కోరుతూ లిఖితపూర్వకంగా అభ్యర్థించాం. తెలంగాణా ప్రభుత్వం ఇప్పటికే పోస్టుల వెసుల బాటు ఆధారంగా పదోన్నతులు ఇచ్చేందుకు జీఓ జారీ చేసింది. అదే తరహాలో ఏపీలో జీఓ జారీ చేసి పదోన్నతులు ఇవ్వాలి.
 -కె హేమసుందర్, జిల్లా ఎంపీడీఓల సంఘం అధ్యక్షుడు
 
 సీనియారిటీ జాబితా ప్రకటించండి...
 పదోన్నతులు కల్పించడానికి ముందుగా సీనియారిటీల జాబితా ప్రకటించాలి. అలాగే పదోన్నతులకు అవసరమైన సర్వీసు రూల్స్ ఫ్రేం చేయాలి. ఆ తర్వాత సింగిల్ సిటింగ్ పదోన్నతులు ఇవ్వాలి. ప్రభుత్వం ఎంపీడీఓల విషయంలో నిర్ధిష్టమైన జీఓ విడుదల చేయలి.
 - కిరణ్‌కుమార్, ఎంపీడీఓ, లావేరు

Advertisement

తప్పక చదవండి

Advertisement