తాండూరులో ముస్లింల భారీ ర్యాలీ | Sakshi
Sakshi News home page

తాండూరులో ముస్లింల భారీ ర్యాలీ

Published Sat, Dec 7 2013 1:05 AM

Muslims rally in Tandur

 తాండూరు టౌన్, న్యూస్‌లైన్: పట్టణంలో ముస్లింలు శుక్రవారం భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించారు. 1992 డిసెంబర్ 6న జరిగిన బాబ్రీ మసీదు కూల్చివేతకు నిరసనగా నల్లబ్యాడ్జీలు ధరించి, నల్ల జెండా లు పట్టుకుని స్థానిక రైల్వే స్టేషన్ నుంచి శాంతమహల్ చౌరస్తా మీదుగా ఇందిరాచౌక్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు ముస్లిం మతపెద్దలు మాట్లాడుతూ.. మతతత్వ శక్తుల మూలంగా పవిత్రమైన మసీదు నాడు కూల్చివేతకు గురైందని చెప్పారు.
 
  నాటి కేంద్ర ప్రభుత్వం ఈ ఘటనకు పాల్పడుతున్న వారిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు.  కూల్చివేసిన స్థానంలోనే నూతనంగా మసీదును నిర్మించాలని ముస్లింలు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.కార్యక్రమంలో ఖుర్షీద్ హుస్సేన్, ఎంఏ అలీం, హబీబ్‌ఖాన్, హాది, ఆయూబ్‌ఖాన్, ముక్తార్, అసద్‌అలీ, అహ్మద్, సాబేర్, బాసిత్‌అలీ తదితరులు ఉన్నారు. ర్యాలీ సందర్భంగా పోలీసులు పట్టణంలో గట్టి బందోబస్తు ఏర్పాటుచేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా మసీద్‌ల వద్ద పికెట్ ఏర్పాటు చేశారు.
 
 పరిగి పట్టణంలో..
 పరిగి : బ్లాక్ డే సందర్భంగా శుక్రవారం పరిగి పట్టణంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు.   పట్టణంలోని ప్రధాన కూడళ్లు, మజీద్‌ల దగ్గర స్థానిక పోలీసులతో అదనపు బలగాల సాయం తీసుకున్నారు. ప్రత్యేక టీంలతో రోజంతా పరిగి సీఐ వేణుగోపాల్‌రెడ్డి, ఎస్‌ఐలు లకా్ష్మరెడ్డి, శివప్పలు బందోబస్తు పర్యవేక్షించారు.   
 శంషాబాద్: పట్టణంలో పోలీసులు, సీఆర్‌పీఎఫ్ బలగాలతో మార్చ్ నిర్వహించారు. బ్లాక్ డే సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ముందస్తు జాగ్రత్తగా అన్ని ప్రాంతాల్లో పోలీసులు బందోబస్తు నిర్వహించారు. ముస్లిం సోదరులు నల్లజెండాలతో నిరసన వ్యక్తం చేస్తూ పట్టణంలో ర్యాలీలు నిర్వహించారు.
 

Advertisement
Advertisement