నంద్యాల : భూమా నాగిరెడ్డి ఓ గూండా, ఫ్యాక్షనిస్టు అని అసెంబ్లీ సాక్షిగా విమర్శించిన కాల్వ శ్రీనివాసులు.. ఇప్పుడు సిగ్గులేకుండా ఎలా ఓట్లు అడుగుతున్నారని వైఎస్ఆర్ సీపీ అధికార ప్రతినిధి జోగి రమేష్ మండిపడ్డారు. కాల్వ శ్రీనివాసులది నోరా.. తాటిమట్టా..? అని విమర్శించారు. బడుగు బలహీనవర్గాల నుంచి కేఈ కృష్ణమూర్తికి గౌరవప్రదమైన ఉపముఖ్యమంత్రి పదవి ఇచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఆయన అధికారాలన్నింటిన్నీ తన చెప్పుచేతుల్లోకి తీసుకుని అవమానిస్తున్నారన్నారు. 'బీసీలకు పెద్ద పీట ఇస్తా అన్నావు.. అంటే పెద్ద కుర్చీనా?' అని చంద్రబాబును ప్రశ్నించారు. తమ అధికారాలు లోకేష్కు ఎందుకిచ్చారో మంత్రి కేఈ.. చంద్రబాబునాయుడిని ప్రశ్నించాలన్నారు.
మంత్రి సోమిరెడ్డి, సోది బాగా చెబుతారని, ఆయన సోమిరెడ్డి కాదు, సోదిరెడ్డి అని విమర్శించారు. వ్యవసాయశాఖను ఆయనకి అప్పగిస్తే, రైతులను గాలికి వదిలేసి, నంద్యాల చుట్టూ తిరుగుతున్నారని మండిపడ్డారు. 'మానిఫెస్టోని భగవద్గీత, బైబిల్, ఖురాన్ లాగా అందరూ భావించారు కాబట్టే మీకు ఓటేశారు. పూర్తి రుణమాఫీ చేస్తా అన్నావు గాలికి వదిలేసావు. ఇంటికో ఉద్యోగం, డ్వాక్రా మహిళల రుణాలమాఫీ, నిరుద్యోగ భృతి అన్నింటిన్నీ గాలికి వదిలేసినందుకు చంద్రబాబును నడిరోడ్డుపై ఉరితీసినా ఫరవాలేదనే మాట ఐదు కోట్ల మంది ప్రజలంటున్నారు. ఈ ఎన్నిక వైఎస్ఆర్ సీపీకి, చంద్రబాబుకు సంబంధించినది. అరిచే కుక్కలను, మొరిగే కుక్కలను నంద్యాల ప్రజలు తరిమికొడతారు. జగన్ పక్షానే నంద్యాల ప్రజలున్నారు'' అని జోగి రమేష్ అన్నారు.