మోడీతోనే దేశప్రగతి | Sakshi
Sakshi News home page

మోడీతోనే దేశప్రగతి

Published Wed, Jan 22 2014 3:01 AM

Narendra Modi outlines India development model

భిక్కనూరు, న్యూస్‌లైన్ : నరేంద్రమోడీ ప్రధాని అయితే మనదేశం ప్రపంచంలోనే అత్యంత ప్రగతిగల దేశంగా రూపొందుతుందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు పల్లె గంగారెడ్డి అన్నారు.  ప్రజాసమస్యల పరిష్కారం కోసం బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు తాటిపల్లి విఠల్‌గుప్తా తలపెట్టిన నియోజకవర్గ పాదయాత్ర మంగళవారం భిక్కనూరు శ్రీ సిద్ధరామేశ్వరాలయం వద్ద ప్రారంభమైంది. ఈ యాత్రను  పల్లె గంగారెడ్డి జెండా ఊపి ప్రారంభించారు.  చౌరస్తా వద్ద పార్టీ జెండాను ఆవిష్కరించారు. పాదయాత్ర లో భాగంగా పల్లె గంగారెడ్డి పలుచోట్ల మాట్లాడారు. గల్లీ నుంచి ఢిల్లీ దాకా ప్రజలు నరేంద్రమోడీ ప్రధాని కావాలని జపం చేస్తున్నారని దేవుడు కరుణించే అవకాశం మెండుగా ఉందన్నారు. మోడీ ప్రధానమంత్రి అయితే  దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెంది అగ్రరాజ్యంగా నిలిచిపోవడం తథ్యమన్నారు.
 
 ఇప్పటి నుంచే కాంగ్రెస్ నేతలు మోడీ ప్రధాని అయితే తాము చేసిన అక్రమాలు, అవినీతి ఎక్కడ బయటపడుతుందోనని బెంబేలెత్తిపోతున్నారన్నారు.   పార్లమెంట్‌లో తెలంగాణ బిల్లుకు బీజేపీ సంపూర్ణ మద్దతు ఇస్తుందన్నారు. గ్రామాల్లో బూత్‌లెవల్ నుంచి పార్టీని పటిష్టం చేయాల్సిన బాధ్యత కార్యకర్తైపైనే ఉందన్నారు. బీజేపీ మినహా అన్ని రాజకీయ పార్టీల్లో వారసత్వపు నేతలు కొనసాగుతున్నారని దుయ్యబట్టారు. బీజేపీలో ఇప్పటి వరకు వారసత్వ రాజకీయాలు లేవన్న సంగతి ప్రజలకు కార్యకర్తలు వివరించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. విఠల్‌గుప్తా పాదయాత్ర చేపట్టి నియోజకవర్గంలో పేద ప్రజల సమస్యలు తెలుసుకోవాలని ముందుకురావడం అభినందనీయమన్నారు.  బీజేపీ నేతలు గంగారెడ్డి, మురళీధర్‌గౌడ్, రంజిత్‌మోహన్, ప్రభాకర్‌యాదవ్, క్రిష్ణాగౌడ్, లింబాద్రి, తున్కివే ణు, యాచం సురేష్‌గుప్తా, డప్పు రవి, పుల్లూరి సతీష్, నర్సింలు, సంజీవరెడ్డి, జిల్లెల రవీందర్‌రెడ్డి, క్రిష్ణాగౌడ్ తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement
Advertisement