ఎదురు చూపు | Sakshi
Sakshi News home page

ఎదురు చూపు

Published Mon, Jul 28 2014 3:11 AM

no clarity on EAMCET counseling

మార్కాపురం: ఎంసెట్ కౌన్సెలింగ్‌పై రెండు రాష్ట్రాల్లో ఏర్పడిన ప్రతిష్టంభన విద్యార్థుల్లో గందరగోళానికి దారి తీస్తోంది. గత ఏడాది ఇదే సమయానికి కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభం కాగా, రాష్ట్ర విభజన ఏర్పడి ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై స్పష్టత రాకపోవడం, సుప్రీంకోర్టులో కౌన్సెలింగ్‌పై, ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై విచారణ సాగుతుండటంతో ఎప్పుడు కౌన్సెలింగ్ జరుగుతుందో, తరగతులు ఎప్పుడు ప్రారంభమవుతాయో తెలియని పరిస్థితి ఏర్పడింది.

దీంతో పలువురు విద్యార్థులు కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలకు చదువు నిమిత్తం వెళ్తుండగా, మరి కొంత మంది ఇతర డిగ్రీలపై ఆసక్తి చూపుతున్నారు. ఎంసెట్ కౌన్సెలింగ్‌కు అక్టోబర్ 31 వరకు గడువు ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయటంతో మన రాష్ట్రంలో కూడా కౌన్సెలింగ్ తేదీలపై స్పష్టత లేదు. పలువురు విద్యార్థులు ఎంసెట్ కౌన్సెలింగ్‌లో జరుగుతున్న జాప్యంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

 ఎంసెట్‌లో ర్యాంక్‌లు వచ్చిన విద్యార్థులు ప్రతి రోజు ఉన్నత విద్యామండలి కార్యాలయానికి ఫోన్ చేస్తున్నప్పటికీ అధికారుల నుంచి సమాధానం రావడం లేదు. ఈ ప్రాంత విద్యార్థులు కౌన్సెలింగ్‌లో తాము హైదరాబాదులోని కళాశాలలను ఆప్షన్‌గా ఎంచుకుంటే ఫీజు రీయింబర్స్‌మెంట్ వస్తుందా, రాదా అన్న అనుమానం ఏర్పడింది. 1956 ప్రాతిపాదికన తెలంగాణలో ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇస్తానని ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడం ఇక్కడి విద్యార్థులను ఆందోళనకు గురిచే స్తోంది. స్థానిక డాక్టర్ శామ్యూల్ జార్జి ఇంజినీరింగ్ కళాశాలలో ప్రీ ఇంజినీరింగ్ కోర్సులో పలువురు విద్యార్థులు చేరారు. కౌన్సెలింగ్ తేదీల కోసం ఎదురు చూస్తున్నారు.

Advertisement
Advertisement