బతక లేక.. చావులేఖ! | Sakshi
Sakshi News home page

బతక లేక.. చావులేఖ!

Published Fri, Jul 3 2015 12:55 AM

Not able to leave

బాపట్ల : అప్పటివరకు బాపట్ల రైల్వేస్టేషన్‌లోని రెండో నంబర్ ప్లాట్‌ఫాంపై కనిపించింది ఆ మహిళ. ఇద్దరు కవలపి ల్లలకు వారికి నచ్చిన తినుబండారాలను కూడా కొనిపించింది. అమ్మమ్మ వాళ్ల ఊరికి వెళుతున్నాం. గొడవ చేయకూడదు అంటూ వారిని సముదాయించింది. అమ్మా.. నేను మాచవరం వస్తున్నా అంటూ తల్లికి ఫోన్ చేసి చెప్పింది. అంతలోనే.. అందరూ చూస్తుండగానే ఒంగోలు వైపు నుంచి విజయవాడకు వెళుతున్న గూడ్సు రైలు కిందకు దూకేసింది. కళ్ల ముందే జరిగిన ఈ ఘటనను చూసిన ప్రయాణికులు ఒక్కసారిగా అవాక్కయ్యారు. కొద్దిసేపటికి ఆ ప్రాంతం అంతా విషాద ఛాయలు అలుముకున్నాయి.
 
 ఈ ఘటనలో మండలంలోని చెరువుజమ్ములపాలేనికి చెందిన మెట్ల నాగవర్ధని(28), తులసీరామ్(5), తరుణశ్రీ(5) రైల్వే పట్టాలపై చెల్లాచెదురుగా మాంసపు ముద్దల్లా పడి ఉన్న దృశ్యం అందరినీ కలిచివేసింది. ఆమె తీసుకు వచ్చిన బ్యాగ్, రాసిన సూసైడ్ నోట్ ప్లాట్‌ఫాంపైనే ఉండగా వాటిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
 
 తల్లి నాగమల్లేశ్వరి క థనం ప్రకారం..
 మాచవరానికి చెందిన నాగవర్ధనికి ఏడేళ్ల కిందట చెరువుజమ్ములపాలేనికి చెందిన మెట్ల శ్రీనివాసరావుతో వివాహం జరిగింది. వారికి ఇద్దరు కవల పిల్లలు. భర్త శ్రీనివాసరావుతో కలిసి కర్ణాటక రాష్ట్రం రాయచూర్‌లో వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. పిల్లలు నాయనమ్మ ఇంట్లో ఉండి స్థానిక పబ్లిక్ స్కూల్‌లో చదువుతున్నారు.
 
  ఇటీవలే నాగవర్ధని రాయచూర్ నుంచి బాపట్లకు వచ్చింది. ఆస్తి వివాదాలు కారణంగా తన కుమార్తె ఫోన్ చేసి అత్త, మామ, ఆడపడుచు, ఆడపడుచు భర్త వేధింపులకు గురిచేస్తున్నారని ఫోన్‌లో చెప్పినట్లు ఆమె తల్లి నాగమల్లేశ్వరి విలపిస్తూ తెలిపింది. అదే విషయాన్ని సూసైడ్ నోట్‌లో కూడా రాసిందని పేర్కొంది.

Advertisement
Advertisement