పుట్టినరోజు నాడే పరలోకానికి | Sakshi
Sakshi News home page

పుట్టినరోజు నాడే పరలోకానికి

Published Fri, Apr 18 2014 3:33 AM

On Birth day occured road accident

వింజమూరు, న్యూస్‌లైన్: పుట్టినరోజును ఘనంగా జరుపుకునేందుకు కేకు తీసుకుని స్నేహితులతో కలిసి బైక్‌లో బయలుదేరిన యువకుడు రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. ఈ ప్రమాదంలో అతనితో పాటు మరొకరు దుర్మరణం పాలవగా, ఇంకొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన గురువారం రాత్రి వింజమూరు- కాటేపల్లి మార్గంలో చోటుచేసుకుంది. కొండాపురం మండలం గొట్టిగుండాల మజరా ఉప్పాలవారిపాళేనికి చెందిన యరజర్ల మధు(18)ది గురువారం పుట్టిన రోజు. ఇతని తల్లిదండ్రులు బెంగళూరులో బేల్దారి పనిచేసుకుని ఉపాధి పొందుతున్నారు. పుట్టిన రోజు వేడుక కోసమని నగదు అడగడంతో బ్యాంకు ఖాతాలో వేస్తామని చెప్పారు.
 
 ఇంతలో ఉదయగిరిలోనూ పని ఉండడంతో గ్రామానికే చెందిన తన స్నేహితులు అక్కిదాసరి భాస్కర్(30), అరిగెల సదాశివరావుతో కలిసి ఉదయం బైక్‌పై వింజమూరు వచ్చారు. బైక్‌ను వింజమూరులో పెట్టి ఉదయగిరి వెళ్లి సాయంత్రం వచ్చారు. ఏటీఎంలో నగదు డ్రా చేసుకున్న తర్వాత పుట్టినరోజు వేడుక కోసం కేక్ తీసుకుని బైక్‌పై సొంతూరికి బయలుదేరారు. ఈ క్రమంలో రావిపాడు స్టేజి సమీపంలో ఎదురుగా ఒకే లైటుతో వస్తున్న ట్రాక్టర్‌ను పెద్దవాహనంగా గుర్తించలేక ఢీకొట్టారు.
 
 మధు, భాస్కర్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. గాయపడిన సదాశివరావును స్థానికులు వింజమూరు ఆస్పత్రికి తరలించారు. మధు పుట్టిన రోజు నాడే ప్రాణాలు కోల్పోవడంతో బంధుమిత్రుల రోదనలు మిన్నంటాయి. బెంగళూరులో ఉన్న తల్లిదండ్రులకు ఈ సమాచారం అందించారు. భాస్కర్‌కు 8 నెలల క్రితమే వివాహమైంది. ఆయన మరణాన్ని కుటుంబసభ్యులు జీర్ణించుకోలేక గుండలవిసేలా రోదిస్తున్నారు. కలిగిరి సీఐ సుబ్బారావు, వింజమూరు ఎస్సై కె.తిరుపతయ్య సంఘటన స్థలాన్ని పరిశీలించారు. ట్రాక్టర్ కొండాపురం మండలం సల్లగిరిగల నుంచి ఏఎస్‌పేట దర్గాకు భక్తులతో వెళుతున్నట్లు గుర్తించారు.
 

Advertisement
Advertisement