రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి

Published Fri, Nov 21 2014 2:07 AM

రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి - Sakshi

సోమల: మండలంలోని కరకమంద వద్ద గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో భర్త మృతిచెందాడు. భార్యకు తీవ్ర గాయాలయ్యాయి. ఆమెను తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించారు. బంధువుల అమ్మాయికి పాప పుట్టడంతో చూడడానికి సోమల మండలం అడుసుపల్లెకు చెందిన పెద్దరెడ్డెప్ప(43), భార్య రమాదేవి(40) గురువార ం ఉదయం సూరయ్యగారిపల్లెకు బైక్‌లో వెళ్లారు. పాప చూసి సాయంత్రం 5 గంటల ప్రాంతంలో స్వగ్రామానికి బయలుదేరారు. కొద్ది దూరం రాగానే పుంగనూరు-తిరుపతి రహదారిలోని కరకమంద బస్టాండు వద్దనున్న మలుపులో కర్ణాటక నుంచి వస్తున్న మారుతీ కారు వీరి బైక్‌ను ఢీకొంది.

ఈ ఘటనలో పెద్ద రెడ్డెప్ప అక్కడికక్కడే మృతి చెందాడు. భార్య రమాదేవికి తీవ్ర గాయాలయ్యాయి. అదే మార్గంలో వెళుతున్న మరో కారులో ఆమెను తిరుపతికి తరలించారు. మృతునికి కుమారుడు శ్రీకాంత్ (11), కుమార్తె మైథిలి(8) ఉన్నారు. స్థానికుల సమాచారం మేరకు ఎస్‌ఐ చిన్నరెడ్డెప్ప ఘటనా స్థలానికి చేరుకుని, వివరాలు సేకరించారు. కళ్ల ముందే తమ బంధువు మృతి చెందడంతో సూరయ్యగారిపల్లెలో, గ్రామస్తుడు మృతి చెందడంతో అడుసుపల్లెలో విషాదఛాయలు అలముకున్నాయి. ‘పాపను చూసొస్తామని చెప్పి అటే వెళ్లిపోయావా నాయనా’ అంటూ కుటుంబ సభ్యులు రోదించడం పలువురిని కలచివేసింది.

Advertisement
Advertisement