నాకు సంబంధం ఉందని నిరూపించు! | Sakshi
Sakshi News home page

నాకు సంబంధం ఉందని నిరూపించు!

Published Wed, Jan 1 2014 1:20 AM

నాకు సంబంధం ఉందని నిరూపించు! - Sakshi

జూబ్లీహిల్స్‌లో భవనంపై బాబుకు పి.రవీంద్రనాథ్‌రెడ్డి సవాల్
ఆరోపణలు చేస్తున్న నీరజారావుకు త్వరలో టీడీపీ టికెట్!


కడప, న్యూస్‌లైన్: హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ రోడ్డు నంబర్ 2లో జీహెచ్‌ఎంసీ కూల్చిన భవనానికి, తనకు ఎటువంటి సంబంధం లేదని కడప మాజీ మేయర్, వైఎస్సార్ సీపీ సీజీసీ సభ్యుడు పి.రవీంద్రనాథ్‌రెడ్డి మరోసారి స్పష్టం చేశారు. తనకు సంబంధముందని మాట్లాడిన టీడీపీ అధినేత చంద్రబాబు ఆధారాలతో సహా నిరూపించాలని సవాల్ విసిరారు. దీనిపై ఏ వేదికపై అయినా సరే బహిరంగ చర్చకు సిద్ధంగా ఉన్నామన్నారు. తనది తప్పయితే చంద్రబాబు కాళ్లు పట్టుకుంటానని, లేదంటే ఆయన తన కాళ్లు పట్టుకోవాలని సవాల్ విసిరారు. మంగళవారం వైఎస్ గెస్ట్‌హౌస్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. అనంతపురం రైలు ప్రమాదంలో 26 మంది చనిపోయి అనేకమంది గాయాల పాలైతే పరామర్శించడానికి సమయం లేని చంద్రబాబుకు 420 గజాల స్థల వివాదంపై పరిశీలనకు వెళ్లడానికి మాత్రం టైమ్ ఉందా అంటూ ఎద్దేవా చేశారు.
అందుకే నీరజారావు ఆరోపణలు..
కొన్ని పత్రికలు, చానెళ్లతో కుమ్మక్కై చంద్రబాబు డ్రామా ఆడిస్తున్నారని రవీంద్రనాథ్‌రెడ్డి అన్నారు. భూమి విషయంలో తమపై ఆరోపణలు చేస్తున్న నీరజారావు ఎవరా అని విచారిస్తే ఆమె టీవీ9 చానల్లో మహారాష్ట్ర వింగ్ చూస్తున్నారని, గతంలో ఏబీఎన్ ఆంధ్రజ్యోతిలో కూడా పనిచేశారని తెలిసిందన్నారు. ప్రస్తుతం హైదరాబాద్ సిటీలో ఆమెకు టీడీపీ టికెట్ ఇస్తారన్న ప్రచారం కూడా జరుగుతోందని తెలిపారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై బురదచల్లడానికి తనను పావుగా వాడుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే తన హయాంలో జరిగిన కుంభకోణాలు, ఆయన ఆస్తుల వివరాలను బయట పెట్టాలన్నారు.  రామోజీ ఫిల్మ్‌సిటీలో 1600 ఎకరాలు ఎక్సెస్ ల్యాండ్ అని ట్రిబ్యునల్ తీర్పునిస్తే చంద్రబాబుకు అది ఎందుకు కనిపించదని ప్రశ్నించారు.
 

Advertisement
Advertisement