ప్రచారం పతాకస్థాయికి... | Sakshi
Sakshi News home page

ప్రచారం పతాకస్థాయికి...

Published Thu, Apr 3 2014 3:12 AM

Peak of the campaign ...

చిత్తూరు (అర్బన్), న్యూస్‌లైన్: మునిసిపల్ ఎన్నికలు ముగియగానే అందరి చూపు ఇప్పు డు గ్రామాలపైనే ఉంది. జిల్లాలో ఆరు మునిసిపాలిటీలు, ఒక కార్పొరేషన్ ఎన్నికలు పూర్తరుున తరువాత జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నిక లపై దృష్టిపడింది. నేతలంతా ఇప్పుడు పల్లెలవైపు పరుగులు తీస్తున్నారు. తొలివిడతగా మదనపల్లె డివిజన్ పరిధిలో 31 జెడ్పీటీసీలు, 447 ఎంపీటీసీ స్థానాలకు ఈ నెల 6న ఎన్నికలు జరగనున్నాయి.

ఈ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం ఆఖరు తేదీ కావడంతో గ్రామాల్లో రాజకీయాలు ఊపందుకున్నాయి. ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి నేతలు పగలంతా ప్రచారంలోమునిగి, రాత్రులు మండలాల్లో పోటీలో ఉన్న అభ్యర్థుల ఇళ్లల్లో, పట్టున్న నేతల విడిదిలో బస చేస్తూ వ్యూహాలు పన్నుతున్నారు.
 
గ్రామాల్లోనే మకాం
 
నియోజకవర్గ స్థాయి నేతలంతా ఉదయం నుంచి రాత్రి వరకు గ్రామాల్లోనే మకాం వేసి ప్రచారం సాగిస్తున్నారు. పోటీ తీవ్రంగా ఉన్న ప్రాంతాల్లో రాత్రులు సైతం అక్కడే బస చేసి అభ్యర్థుల బలాలు, బలహీనతలను లెక్కకట్టి ఎన్నికల వ్యూహాలను రచిస్తున్నారు.   

పల్లెలంతా తిరుగుతూ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. స్థానిక నేతలతో ఎక్కడికక్కడ సమాలోచనలు చేస్తున్నారు. ఇక నియోజవర్గ నేతల సతీమణులు సైతం ప్రచారాల్లో పాల్గొంటూ పతులకు చేదోడు వాదోడుగా నిలుస్తున్నారు. ఇక మహిళలకు రిజర్వయిన స్థానాల్లో సతులను గెలిపించుకోవడానికి పతులు కసరత్తు చేస్తున్నారు. అంతేగాక బరిలో ఉన్న అభ్యర్థి కుటుంబం మొత్తం గడపగడపకు వెళ్లి ఓట్లు అభ్యర్థిస్తూ మద్దతు కూడగట్టుకునే ప్రయత్నంచేస్తోంది.
 
చేరికలు, వలసలతో బిజీ....

 
నేతల వలసలు ఎక్కువయ్యాయి. ప్రధానంగా పశ్చిమ మండలంలోని ఓ ప్రధాన నాయకుడు ఇప్పటికే మూడు పార్టీల కండువాలు కప్పుకున్నారు. ఆయన పార్టీ మారినప్పుడల్లా క్యాడర్ విధిలేని పరిస్థితుల్లో ఇతర పార్టీల జెండాలు మోశారు. వరుసగా పార్టీలు మారుతుండటంతో జనం చీదరించుకుంటున్నారని ద్వితీయ శ్రేణి క్యాడర్ సదరు నాయకుడిపై గుర్రుగా ఉంటోంది. ఈ సారి తాము ఏ పార్టీలోకి రామని, ఎవ్వరికీ ప్రచారం చేయమని ఖరాకండిగా చెప్పేసింది.

వరుస వలసలతో ప్రజల్ని తికమకపెట్టి మన పార్టీనే అధికారంలోకి వస్తుం దని గాంభీర్యం పలుకుతున్న టీడీపీకి రెబల్స్ పోరు వీడటంలేదు. తొలివిడత పోరులో 31 జెడ్పీటీసీ స్థానా ల్లో 11 చోట్ల రెబల్స్ ఉన్నారు. వీరిని బుజ్జగించే ప్రయత్నాలు నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లకు అప్పగించడంతో, ఒకవైపు ప్రచారం చేస్తూ, మరోవైపు అసమ్మతిని బుజ్జగించలేక వారి పరిస్థితి అయోమయంగా మారింది.
 

Advertisement
Advertisement