పల్లె పల్లెకూ ఎల్‌ఈడీ వెలుగులు | Sakshi
Sakshi News home page

పల్లె పల్లెకూ ఎల్‌ఈడీ వెలుగులు

Published Mon, May 25 2020 3:10 AM

Peddireddy Ramachandra Reddy Comments On LED Street Lights - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో అన్ని గ్రామాల్లో ఎల్‌ఈడీ వీధి లైట్ల ఏర్పాటుకు ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. విద్యుత్, పంచాయతీరాజ్, ఇతర శాఖల అధికారులతో మంత్రి టెలీ కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఎల్‌ఈడీ వీధి దీపాలు బిగించడమే కాకుండా.. నిర్వహణపైనా ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులకు మంత్రి సూచించారు. వెలగని వీధి దీపాల సమాచారాన్ని తెలుసుకునేందుకు  గ్రామ వలంటీర్ల సహకారం తీసుకోవాలన్నారు. ఈ వివరాలను ఇంధన పొదుపు సంస్థ సీఈవో ఎ చంద్రశేఖర్‌రెడ్డి ఆదివారం మీడియాకు వెల్లడించారు. 

ఇవీ ప్రతిపాదనలు 
► రాష్ట్రంలో ఇప్పటివరకూ 10,382 గ్రామ పంచాయతీలలో 23. 29 లక్షల ఎల్‌ఈడీ వీధి లైట్లను బిగించారు.  
► తాజాగా ప్రజాప్రతినిధుల నుంచి ఎల్‌ఈడీ వీధి దీపాల కోసం విజ్ఞప్తులొస్తున్నాయి. ఇలాంటి 2,303 గ్రామాలను గుర్తించి.. అన్నిచోట్లా ఎల్‌ఈడీ లైట్లను అమర్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. 
► ఎల్‌ఈడీ వీధి దీపాలు బిగించడం వల్ల ఏడాదికి 260 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ను ఆదా చేయవచ్చని, తద్వారా ఏటా రూ.156 కోట్ల విద్యుత్‌ బిల్లులు ఆదా అవుతాయని ఇంధన శాఖ అధికారులు మంత్రికి తెలిపారు.  
► రాష్ట్రంలో మరోసారి భారీ ఎత్తున చేపట్టనున్న ఎల్‌ఈడీ వీధి లైట్ల కార్యక్రమానికి ఇంధన శాఖ పూర్తి స్థాయి లో సహకారం అందిస్తుందని ఇంధన శాఖ కార్యదర్శి శ్రీకాంత్‌ నాగులపల్లి తెలిపారు. 
► వీధిలైట్ల ఏర్పాటుకు అనుమతి వస్తే జూన్‌ నెలలో అయినా పనులు చేపట్టేందుకు సిద్ధంగా ఉండాలని పంచాయతీరాజ్‌ కమిషనర్‌ గిరిజా శంకర్‌ సంబంధిత అధికారులకు సూచించారు.  
► టెలీకాన్ఫరెన్స్‌లో పంచాయతీరాజ్‌ శాఖ ముఖ్య కార్యదర్శి  గోపాలకృష్ణ ద్వివేది పాల్గొన్నారు. 

Advertisement
Advertisement