పింఛన్ కష్టాలు | Sakshi
Sakshi News home page

పింఛన్ కష్టాలు

Published Sun, Jul 13 2014 2:36 AM

pension problems

నెల్లూరు(బారకాసు):  పింఛన్‌దారులకు పది రోజులుగా ఎదురుచూపులు తప్ప.. పింఛన్ నగదు అందలేదు. గతంలో ఒకటో తేదీన ఠంచన్‌గా పింఛన్ అందేది. ఇప్పుడా పరిస్థితులు కనుమరుగయ్యాయి. పింఛన్ ఎప్పుడు వస్తుందో తెలియక వృద్ధులు ఆందోళన చెందుతున్నా రు. 10వ తేదీ దాటిపోయినా పింఛన్ సొమ్ము అందలేదు. దీంతో వృద్ధులు, వితంతువులు, వికలాంగులు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నారు. నిబంధనల పేరుతో ప్రభుత్వం తమతో చెలగాటం ఆడుతుందని పింఛన్‌దారులు ఆవేదన చెందుతున్నారు. కొత్త ప్రభుత్వ విధానాలపై పింఛన్‌దారులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అసలు ఈనెల పింఛన్ వస్తుందా.. రాదా అని సందేహ పడుతున్నారు. గ్రామాల్లో పింఛన్ పంపిణీ చేసే కమ్యూనిటీ సర్వీసు ప్రొవైడర్ల జాడే లేదు. పింఛన్ సొమ్ము మంజూరైతే లబ్ధిదారుల వివరాలు అక్విటెన్స్ డౌన్‌లోడ్ చేసుకోవాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు అందేవి. అలాంటి ఆదేశాలు ఇంకా అందలేదని, ప్రభుత్వం ఇంకా పింఛన్ సొమ్మును మంజూరు చేయలేదని పలువురు అధికారులు పేర్కొంటున్నారు. జిల్లా వ్యాప్తంగా డీఆర్‌డీఏ పరిధిలో 2,61,123 పింఛన్ దారులున్నారు.
 
  వారందరికి సుమారు రూ.5 కోట్లు పంపిణీ జరుగుతోంది. ఒక్క నెల్లూరు నగర కార్పొరేషన్ పరిధిలోనే 22,036 మంది లబ్ధిదారులు పడిగాపులు కాస్తున్నారు. పింఛన్ సొమ్మును ప్రభుత్వం పలు బ్యాంకుల అకౌంట్‌లో జమ చేస్తుంది. ఇప్పటి వరకు ఆయా బ్యాంకుల ఖాతాలకు ప్రభుత్వం సొమ్ము పంపలేదని, అందువల్లనే జాప్యం జరుగుతున్నట్లు సంబంధిత శాఖలోని ఓ అధికారి పేర్కొన్నారు.  జిల్లాలో మొత్తం 2,61,123 మంది పింఛన్‌దారులున్నారు. వారిలో వృద్ధులు 1,24,677 మంది, వితంతువులు 90,042, వికలాంగులు 30,009, కల్లుగీత కార్మికులు 676, చేనేత కార్మికులు 4,843, అభయహస్తం కింద 10,876 మంది పింఛన్‌దారులున్నారు.
 
 ప్రభుత్వం నుంచి రాగానే అందజేస్తాం
 ఈనెల పింఛన్ సొమ్ము విడుదల చేయడం ఎందుకు ఆలస్యమైందో తెలియలేదు. ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి పింఛన్ సొమ్ము మాకు రాలేదు. పింఛన్ సొమ్ము రాగానే వెంటనే పింఛన్ దారులకు అందజేస్తాం. అయితే ఎప్పుడు అనేది తాను కచ్చితంగా చెప్పలేను. త్వరలోనే వచ్చే అవకాశం ఉంది.
 - చంద్రమౌళి, ప్రాజెక్ట్ సంచాలకులు, డీఆర్‌డీఏ
 

Advertisement

తప్పక చదవండి

Advertisement