పింఛను మింగేశారు | Sakshi
Sakshi News home page

పింఛను మింగేశారు

Published Wed, Jul 15 2015 11:49 PM

Pension   unfair

అంగన్వాడీ ఆయా ఆవేదన

నాతవరం : ఎనిమిది నెలలుగా పింఛను సొమ్ము స్వాహాచేశారని మండలంలోని యం.బెన్నవరం గ్రామానికి చెందిన కందుకూరి రత్నం ఆరోపించింది. ఇందుకు సంబంధించి బుధవారం ఆమె తెలిపిన వివరాలిలావున్నాయి. అంగన్వాడీ కేంద్రంలో ఆయాగా పనిచేస్తున్న ఈమెకు పదేళ్లుగా వితంతు పింఛను వస్తోంది. ప్రభుత్వం కొత్తగా విధించిన నిబంధనల మేరకు గత డిసెంబర్ నుంచి పింఛను నిలిచిపోయింది. అర్హత ఉన్న అంగన్వాడీ ఆయాలందరికీ పింఛన్లు రావడంతో అన్యాయం జరిగిందని ఆమె సోమవారం మీకోసంలో కలెక్టర్‌కు ఫిర్యాదు చేసింది. దీనిపై స్పందించిన ఆయన విచారణ జరిపి వెంటనే పింఛను ఇవ్వాలని ఆదేశించారు.

డిసెంబర్ నెల నుంచి ఆమెకు పింఛను చెల్లించినట్టుగా ఆన్‌లైన్‌లో నమోదై ఉండటాన్ని గుర్తించిన డీఆర్‌డీఏ అధికారులు ఎంపీడీవో కార్యాలయంలో సంప్రదించాలని ఆమెకు సూచించారు. ఈ మేరకు మండల పరిషత్ అధికారులను ఆమె బుధవారం సంప్రదించింది. సంతకం, వేలిముద్ర లేకుండా తన పింఛను స్వాహా చేశారని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. దీనిపై ఎంపీడీవో యాదగిరీశ్వరరావును వివరణ కోరగా నిబంధనలు ప్రకారం పింఛను మంజూరు చేస్తామన్నారు. పింఛను స్వాహాపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని ఆమె పేర్కొన్నారు.
 
 
 
 

Advertisement
Advertisement