శ్రీకాకుళం :రాష్ట్రంలో అడుగడుగునా అవినీతి పాలన సాగుతోంది. పచ్చనేతలు, వారి అనుచరులకే సంక్షేమ పథకాలు అందుతున్నాయి. పంటల నష్టపరిహారాల్లో, కార్పొరేషన్ రుణాల్లో, రోడ్ల నిర్మాణంలో, అవుట్సోర్సింగ్ ఉద్యోగాల కల్పనలో అర్హులకు అన్యాయం జరుగుతోంది. పాతపట్నం నియోజకవర్గంలోని మెళియాపుట్టి మండలంలో సోమవారం జరిగిన ప్రజాసంకల్ప పాదయాత్రలో భాగంగా గిరిజనులు, వివిధ వర్గాల వారు తమ సమస్యలను ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డికి వివరించారు. అందరి ఆవేదనను ఓపికగా విన్న ఆయన వైఎస్సార్ సీపీ అధికారంలోకి రాగానే సమస్యలు పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.– ప్రజాసంకల్పయాత్ర బృందం
యువతకు ఉద్యోగాలు ఇవ్వాలి
టీడీపీ ప్రభుత్వ హయాంలో ఉద్యోగాల భర్తీ తక్కువగా ఉండడంతో నిరుద్యోగులు రోడ్డున పడుతున్నారు. వీరి సంఖ్య ఏడాదికి ఏడాదికి పెరుగుతోంది. మీరు సీఎం అయ్యాక యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలి.– ఎస్.సీత, గేదెలపోలూరు, మెళియాపుట్టి మండలం
అందని కార్పొరేషన్ రుణాలు
పాతపట్నం, మెళియాపుట్టి పరిసర ప్రాంతాల్లో నివాసముంటున్న ఒరియా బ్రాహ్మణులకు కార్పొరేషన్ రుణాలు అందించాలి. బ్రాహ్మణ కార్పొరేషన్ ద్వారా మాకు ఎటువంటి లబ్ధి లేదు. మీరు సీఎం అయిన తర్వాత ఈ ప్రాంతంలో నివాసముంటున్న ఒరియా బ్రాహ్మణులకు న్యాయం చేయండి.– భాస్కరదాస్, మెళియాపుట్టి