‘జగనన్నా...మీరు అధికారంలోకొస్తే మా లాంటోళ్లకు మేలు జరుగుతుంది’ అంటూ ఆరిఫా అనే మహిళ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డికు లేఖ రాశారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా ఆదివారం కదిరి దాటి కమతంపల్లి సమీపానికి చేరుకోగానే ఆరిఫా అనే ముస్లిం మహిళ ఓ కాగితంపై తన మనసులోని ఆలోచనలను లేఖ రూపంలో రాసి జగన్కు అందజేశారు. తనకు ఇద్దరు కుమార్తెలని, తన భర్త తాగుడుకు బానిసై కుటుంబాన్ని వీధి పాలు చేస్తున్నాడని అందులో పేర్కొంది.
‘నాన్న(వైఎస్సార్)లా మీరు మాలాంటోళ్లకు న్యాయం చేస్తారనే నమ్మకం ఉంది. మాలాంటి పేద వాళ్ల బాధలను ఎవరితో చెప్పుకోలేక మీకు లేఖ ద్వారా తెలియజేస్తున్నా’నంటూ ఆమె పలు అంశాలను అందులో రాశారు. ముఖ్యంగా గ్రామాల్లో బెల్టుషాపులు ఎత్తివేయాలి, పిల్లలకు మంచి చదువులు చదివించాలి, ఆడపిల్లలకు అన్యాయం జరగకుండా మేమున్నామంటూ భరోసా ఇవ్వాలి, మేం చేసే పనులకు తగిన వేతనం అందేలా చూడాలి’ ఇవన్నీ అమలు కావాలంటే మీరు సీఎం కావాలంటూ తన లేఖలో ఆమె రాశారు.