ఎన్నికల ముంగిట్లో.. నిధుల నిగారింపు! | Sakshi
Sakshi News home page

ఎన్నికల ముంగిట్లో.. నిధుల నిగారింపు!

Published Sat, Mar 1 2014 11:33 PM

permission granted to funds released from Zilla Parishad

సాక్షి, రంగారెడ్డి జిల్లా:  బ్యాంకుల్లో మూలుగుతున్న నిధులకు రెక్కలొస్తున్నాయి. ఏళ్లుగా నిలిచిపోయిన పను లు మళ్లీ మొదలవబోతున్నాయి. సాధారణ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఈ మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఇప్పటివరకు పట్టీపట్టనట్లు వ్యవహరించిన ప్రజాప్రతినిధులు ఎన్నికల ముంగిట్లో ప్రజల్లోకి వెళ్లేందుకు అభివృద్ధి పనుల పేరిట విన్యాసాలకు తెరలేపారు. పాత హామీలను నెరవేర్చే పనిలో బిజీ అయ్యారు. భాగంగా ప్రజాప్రతినిధులు ప్రతిపాదించిన పలు పనులను జిల్లా పరిషత్ ఆమోదిస్తూ మంజూరు చేసింది.

 రూ.4.07కోట్ల పనులు
 గతనెల చివరి వారం నుంచి ఇప్పటివరకు జిల్లా పరిషత్ కోటాలో రూ.4.07కోట్ల మేర వివిధ కేటగిరిల్లో 99 పనులు మంజూరయ్యాయి. ఇవన్నీ జడ్పీ సాధారణ నిధులకు సంబంధించినవే. ప్రధానంగా తాగునీరు, కమ్యూనిటీ హాళ్లు, డ్వాక్రా భవనాలు, అంగన్‌వాడీ భవనాలు, సీసీ రోడ్లు తదితర పనులున్నాయి. అయితే నిధులను క్రమపద్ధతిలో వాడే విధంగా ప్రణాళిక సిద్ధం చేసిన నేతలు.. ముందుగా గతంలో మిగిలిపోయిన పనులను పూర్తిచేసే పనిలో పడ్డారు. తక్కువ సమయంలో పనులు పూర్తిచేసి ఓటర్ల మెప్పుపొందే క్రమంలో ఈ ఉపాయాన్ని ఎంచుకున్నారు. తాజాగా మంజూరైన పనులన్నీ ఆ కోవకు చెందినవే.

 అగ్రనేతలదే హడావుడి
 జడ్పీ జనరల్ ఫండ్ నుంచి మంజూరుచేసిన పనుల్లో బడా నేతలు ప్రతిపాదించినవే ఎక్కువగా ఉన్నాయి. మంత్రి ప్రసాద్‌కుమార్, మాజీ మంత్రి సబితారెడ్డి ప్రతిపాదించిన పనులకు ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చినట్లు కనిపిస్తోంది. ముఖ్యంగా శంషాబాద్, చేవెళ్ల, మొయినాబాద్, మహేశ్వరం, బంట్వారం, బషీరాబా ద్ మండలాలకు సంబంధించిన పనులు అధికంగా ఉన్నాయి. కేవలం శంషాబాద్ మండలానికి సంబంధించిన పనులే రూ.44లక్షల విలువ ఉండడం గమనార్హం. అదేవిధంగా మెయినాబాద్ మండలానికి కూడా పెద్దఎత్తున పనులు మంజూరయ్యాయి. 2013 -14 ఆర్థిక సంవత్సరంలో జిల్లా పరిషత్ సాధార ణ కోటా కింద దాదాపు రూ.25కోట్ల వరకు పనులు మంజూరు చేసినట్లు అధికారుల గణాంకాలు చెబుతుండగా.. కేవలం రెండు నెలల్లోనే పావువంతు పను లు యుద్ధప్రాతిపదికన ఆమోదం తెలపడం ప్రజాప్రతినిధుల ఎన్నికల హడావుడిని స్పష్టం చేస్తోంది.

Advertisement
Advertisement