ఆటో ఇంజిన్‌తో కారు సిద్ధం చేసిన పాలిటెక్నిక్‌ విద్యార్థి | Sakshi
Sakshi News home page

ఆటో 'కారు'

Published Sat, Feb 23 2019 7:18 AM

Polytechnic Student Janapareddy Designed Car From Auto - Sakshi

విశాఖపట్నం,కె.కోటపాడు (మాడుగుల) : కుర్రకారు ఆలోచనలన్నీ సృజనాత్మకంగా ఉంటాయి. తక్కువ ఖర్చుతో డీజిల్‌తో నడిచే కారును రూపొందించాలని ఆ గ్రామీణ విద్యార్థి ఆలోచించాడు. దానిని ఆచరణలో పెట్టి..ఆటోను కారుగా మార్చేసి రోడ్లపై పరుగులు పెట్టించేస్తున్నాడు. వివరాల్లోకి వెళ్తే..చౌడువాడ గ్రామానికి చెందిన పాలిటెక్నిక్‌ విద్యార్థి  జనపరెడ్డి మధు పాలిటెక్నిక్‌లో మెకానికల్‌ను చేస్తున్నాడు. స్వతçహాగా చిన్నప్పటి నుంచి  మెకానిజంపై ఆసక్తి ఉన్న  మధు గత ఆరు నెలల కాలంగా కారు  తయారు చేసే పనిలో ఉన్నాడు.

మార్కెట్‌లోని ఆటో ఇంజిన్‌కు ఎక్కువ సామర్థ్యం గల కట్‌ ప్లేట్లును అమర్చాడు. కారు రూపం వచ్చేం దుకు ఐరన్‌ షీట్‌లను అమర్చడంతో పాటు కారు లోపల డాష్‌ బోర్డు, స్టీరింగ్, డోర్‌లను  విద్యార్థి మధు ఏర్పాటు చేశాడు. కారును డీజిల్‌తో నడిచేలా సిద్ధం చేశాడు. లీటర్‌ డీజిల్‌తో 30 కిలో మీటర్లు ప్రయాణంను గంటకు 80కిలో మీటర్ల గరిష్ఠ వేగంతో వెళ్లేలా కారును విద్యార్థి మధు తయారు చేశాడు. తయారీ చేసిన కారును గ్రామంలో శుక్రవారం గ్రామస్తుల సమక్షంలో ప్రారంభించాడు. విద్యార్ధి దశలోనే మధు మంచి ఆలోచన శక్తితో ఆటో ఇంజిన్‌తో కారును తయారు చేయడంతో పలువురు మధును అభినందిస్తున్నారు.

అమ్మానాన్నల ప్రోత్సాహంతోనే..

తల్లిదండ్రులు ఇచ్చిన ప్రోత్సాహంతో ఈ ఆటో కారు  తయారు చేశాను. 80 కిలోమీటర్ల వేగంతో ఈ కారులో ప్రయాణం చేయవచ్చును. చిన్ననాటి నుంచి మెకానిజంపై ఉన్న ఆసక్తితోనే ఇటువంటి వాహనాలను తయారీ చేయడం అలవాటుగా మారింది.   –జనపరెడ్డి మధు,   పాలిటెక్నిక్‌ విద్యార్థి. చౌడువాడ

Advertisement
Advertisement