బల్లకట్టు చదువులు | Sakshi
Sakshi News home page

బల్లకట్టు చదువులు

Published Wed, Aug 13 2014 2:21 AM

బల్లకట్టు చదువులు - Sakshi

బల్లకట్టుపై ప్రయాణం...ఒకే గదిలో ఐదు తరగతులకు విద్యా బోధన...అరకొర వసతులు..ఇవీ సంగం జాగర్లమూడి ఎస్టీ కాలనీ మండల పరిషత్ పాఠశాల విద్యార్థుల కష్టాలు...  ఎన్ని చట్టాలు చేసినా..ఎందరు పాలకులు మారినా వీరి కష్టాలు మాత్రం తొలగిపోవటం లేదు.
 
బడికి పోవాలంటే కాలువ దాటాల్సిందే
ఐదు తరగతులకు ఓకే ఒక్క గది
ఇవీ సంగం జాగర్లమూడి ఎస్టీ కాలనీ విద్యార్థుల కష్టాలు
 తెనాలి మారీసుపేట :
తెనాలి మండలం సంగం జాగర్లమూడిలోని కాలువ కట్టపై మూడు దశాబ్దాలుగా దాదాపు 70 ఎస్టీ కుటుంబాలు జీవిస్తున్నాయి.
ప్రభుత్వం వీరికి ఆసరా చూపించనప్పటికీ,అక్కడి చిన్నారుల కోసం 2001 లో ప్రాథమిక పాఠశాలను ఏర్పాటు చేసింది.
అప్పటి నుంచి పాఠశాలకు రావాలంటే బల్లకట్టుపై కొమ్మమూరు కాలువ దాటాల్సిందే. నిత్యం విద్యార్థులు సంగమేశ్వర స్వామి దేవస్థానం రోడ్డు నుంచి బల్లకట్టు ఎక్కి ఇవతల ఒడ్డుకు చేరుకుంటున్నారు.
బల్లకట్టుతో ఇబ్బంది వస్తే మరో నాలుగు కిలోమీ టర్లు చుట్టు తిరిగి గరువుపాలెం మీదుగా పాఠశాలకు చేరుకోవాలి.
ఇక్కడ పనిచేస్తున్న ఉపాధ్యాయులకూ ఈ పరిస్థితి ప్రాణసంకటంగానే ఉంది.
పూరిపాకలో ఏర్పాటు చేసిన పాఠశాలలో రికార్డు లకు భద్రత లేకపోవటంతో తెనాలి-వైకుంఠపురం రోటరీ క్లబ్ ప్రతినిధులు 2013లో స్పందించి రేకులతో ఓ గదిని నిర్మించారు.
ఈ ఒక్క గదిలోనే 1 నుంచి 5 వరకు చదివే చిన్నారులకు విద్యాబోధన చేయాల్సిన పరిస్థితి.
గతంలో ఈ పాఠశాలకు గ్రామంలోనే స్థలం కేటాయించి భవన నిర్మాణం చేపడతామని అధికారులు చేసిన ప్రకటన ప్రకటనగానే మిగిలిపోయింది.
పాఠశాలలో మొత్తం 33 మంది విద్యార్థులు ఉన్నారు. ఒకటి నుంచి ఐదు తరగతులకు ఇద్దరే ఉపాధ్యాయులు.
విద్యాహక్కు చట్టం ప్రకారం పాఠశాలలో మరుగు దొడ్లు, రక్షిత మంచినీరు, గాలి, వెలుతురు ఉండేలా చూడాలి.
విద్యార్థులకు ఆరోగ్య సమస్యలు లేకుండా వాతావరణం పరిశుభ్రంగా ఉండేలా చూడాలి.
విద్యాశాఖ వద్ద  నిధులున్నా ఇక్కడి విద్యార్థుల సంక్షేమంపై దృష్టి సారించటం లేదనే విమర్శలు వున్నాయి.
గతంలో దాతల సహకారంతో నిర్మించిన ఒకే ఒక మరుగుదొడ్డి విద్యార్థులు, ఉపాధ్యాయుల అవసరాలు తీరుస్తోంది.
ఇప్పటికైనా విద్యాశాఖాధికారులు స్పందించాలని ఇక్కడి ప్రజలు కోరుతున్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement