పుట్టపర్తి టౌన్, న్యూస్లైన్: రాష్ట్రంపై ప్రజలకున్న శ్రద్ధ కాంగ్రెస్, టీడీపీలకు లేదని వైఎస్సార్ సీపీ నాయకుడు డాక్టర్ హరికృష్ణ విమర్శించారు. వైఎస్ విజయమ్మ సమరదీక్షకు మద్దతుగా ఆయన చేస్తున్న ఆమరణ దీక్షలు శుక్రవారం నాటికి ఐదోరోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రం విడిపోతే ఎన్నో సమస్యలు తలెత్తుతాయన్నారు. ఎన్నో దశాబ్దాల చరిత్ర కలిగిన హైదరాబాద్ వంటి మహానగరాన్ని తిరిగి నిర్మించుకోవడం సాధ్యం కాదన్నారు.తెలుగు ప్రజల మనోభావాలకనుగుణంగా నందమూరి హరికృష్ణ రాజీనామా చేయడం హర్షణీయమన్నారు. పల్లె రఘునాథ్రెడ్డి లాంటి కొందరు నాయకులు రాజీనామా డ్రామాలు ఆడుతున్నారన్నారు.
రాష్ట్ర విభజనపై సీమాంధ్ర ప్రజలు ఎంతగా బాధపడుతున్నారో,అంతకంటే ఎక్కువగా పదవులను పట్టుకుని వేలాడుతున్న ప్రజా ప్రతినిధులను ద్వేషిస్తున్నారన్నారు. తెలుగు జాతి ముక్కలు కావడానికి కారకుడైన చంద్రబాబు ఆత్మగౌరవయాత్రను సమైక్యవాదంతో చేస్తాడా లేక వేర్పాటు వాదంతో చేస్తాడా లేదా అవకాశవాదంతో చేస్తాడో స్పష్టం చేయాలని డిమాండ్ చేశాడు. నందమూరి కుటుంబంలో చిచ్చు పెట్టినట్టుగా,సమైక్యాంధ్ర వాదుల్లో చిచ్చుపెట్టి ఉద్యమాన్ని చల్లార్చడానికే ఆయన యాత్ర చేపడుతున్నాడని విమర్శించారు.