తొలగని చీకట్‌లు | Sakshi
Sakshi News home page

తొలగని చీకట్‌లు

Published Wed, Apr 27 2016 12:15 AM

power supply disruption in srikakulam

 శ్రీకాకుళం పాతబస్టాండ్,:  విద్యుత్ కష్టాలు తీరలేదు. మూడు రోజులుగా విద్యుత్ సరఫరాలో వరుస అంతరాయం మంగళవారమూ వెంటాడింది. జిల్లాలో రాత్రి పగలు తేడా లేకుండా విద్యుత్ కోత విధిస్తున్నారు. దీంతో అన్ని వర్గాల వారూ అవస్థలు పడుతున్నారు. గ్రామాల పరిస్థితి మరీ అధ్వానంగా తయూరైంది. చాలా ప్రాంతాల్లో పగలంతా విద్యుత్ సరఫరా నిలిచిపోరుుంది. రాత్రి గ్రామాలన్నీ అంధకారంగా మారాయి. పొందూరు, రణస్థలం, లావేరు. జి.సిగడాం, ఎచ్చెర్ల, నందిగాం, పలాస, వజ్రపు కొత్తూరు, మందస, తదితర ప్రాంతాల్లో రోజంతా విద్యుత్ సరఫరాలేదు.
 
 శ్రీకాకుళం రూరల్‌లో కొన్ని గ్రామాలకు వేకువ జామున 4 నుంచి ఉదయం 10 గంటల వరకు, మరలా  మధ్యాహ్నం 12నుంచి 3  వరకు, సాయంత్రం 6 వరకూ తరువాత కూడా కరెంటు కోతలు విధించారు. పట్టణాల్లో కూడా మంగళవారం వేకువ జామున  4గంటల నుంచి ఉదయం 9 గంటలకు విద్యుత్ లేదు. మధ్యాహ్నం 12 నుంచి 2 గంటలవరకు సరఫరాలేదు. సాయంత్రం నాలుగు  నుంచి  6 గంటల వరకు విద్యుత్ లేదు. రాత్రి పూట కూడా గంటల తరబడి పదేపదే విద్యుత్ కోత విధించారు. శ్రీకాకుళంతో పాటు మిగిలిన పురపాలక సంఘాల్లో కోతతో జనం అల్లాడుతున్నారు. ఇచ్చాపురానికి పగలంతా విద్యుత్ లేదు. పాలకొండకు సాయంత్రం 4 గంటల వరకు సరఫరా జరగలేదు. నిద్ర కరువైందని పట్టణవాసులు వాపోతున్నారు. మరోపక్క దోమల బెడద అధికమైంది.
 
   పరిశ్రమలు మూత పడ్డాయి.
 విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో మంగళవారం జిల్లాలో చాలా పరిశ్రమలు మూతపడ్డాయి. రణస్థలం, పొందూరు, రాజాం, పలాస, శ్రీకాకుళం, టెక్కలి, తదితర ప్రాంతాల్లోని పరిశ్రమలు మంగళవారం పనిచేయలేదు. కార్మికులు పనులు లేక ఖాలీ గా ఉండిపోయారు. మరికొన్ని పరిశ్రమలు రోజులు రెండు మూడు గంటలు మాత్రమే పనిచేశాయి.
 
   సరఫరాలో  సమస్యలు,
 విశాఖపట్నంలోని గ్రిడ్ రెండు రోజులు క్రితం పాడైంది. వాటిని మరమ్మతులు చేపట్టినా మళ్లీ విఫలమవుతున్నట్లు తెలిసింది. విద్యుత్ సరఫరా లైన్లు కూడా చాలా వరకు పాడయ్యాయి. తీగలకు జంగ్ పట్టడంతో అంతరాయమేర్పడుతోంది. ప్రధానంగా తెల్లవారుజామున సమస్యలు తలెత్తుతున్నాయని అధికారులు చెపుతున్నారు. జల్లాలోని 7.37 లక్షల సర్వీసులకు రోజుకు 180 మెగావాట్ల విద్యుత్ అవసరం. మంగళవారం కేవలం 60 మెగావాట్ల విద్యుత్ మాత్రమే శ్రీకాకుళం సర్కిల్‌కి సరఫరా జరిగింది. దీనిలో లైన్ లాస్ సగటున 7శాతం వరకు పోతుంది. అప్పుడప్పుడు లోడ్ రిలీఫ్ పేరిట కోతలు వేస్తున్నారు.  బుధవారం నాటికి సమస్య  పరిష్కారమవుతుందని ఏపీఈపీడీసీఎల్ సర్కిల్ సూపరెంటెండెంట్ ఇంజనీరు శరత్ కుమార్ ధీమా వ్యక్తంచేశారు. మంగళవారం కేవలం 40 శాతం మాత్రమే విద్యుత్ సరఫరా చేయగలిగామన్నారు.
 

Advertisement
Advertisement