సాక్షి, పులివెందుల: ప్రజా సంకల్ప యాత్ర రెండో రోజు షెడ్యూల్ను వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన అధికారిక ట్విట్టర్ అకౌంట్లో పోస్ట్ చేశారు. ఆయన మంగళవారం పులివెందుల, కమలాపురం నియోజక వర్గాల్లో పాదయాత్ర చేయనున్నారు. ఇడుపులపాయ-వేంపల్లి రోడ్డు మీదుగా రెండో రోజు మొత్తం 12.6 కిలో మీటర్లు సాగే పాదయాత్ర నీలతిమ్మాయపల్లి సమీపంలో ముగియనుంది.
ప్రజా సంకల్పయాత్ర రెండో రోజు పూర్తి షెడ్యూల్ :
కాగా, తొలి రోజు వైఎస్ఆర్ ఘాట్ దగ్గర నివాళి అర్పించిన వైఎస్ఆర్ సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ..ఉదయం 9 గంటల 47 నిమిషాలకు తొలి అడుగు వేశారు. ప్రజాసంకల్ప యాత్రకు తరలివచ్చిన అభిమానులతో ఇడుపులపాయ జనసముద్రమైంది. తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా తమిళనాడు, కర్ణాటకల నుంచి కూడా వైఎస్ జగన్ అభిమానులు తరలివచ్చారు. జగన్తో కలిసి వేలాది అభిమానులు ఆయన అడుగులో అడుగేశారు.
వైఎస్ జగన్ వెంట..పలువురు వైఎస్ఆర్ సీపీ నేతలు కూడా కలిసి నడుస్తున్నారు. పాదయాత్రలో తన దృష్టికి వచ్చిన..తాను చూసినా సమస్యలతోనే వైఎస్ఆర్ సీపీ మేనిఫెస్టో రూపొందుతుందని జగన్ ఇది వరకే ప్రకటించారు. ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకు సాగే పాదయాత్ర 180 రోజులు 125 నియోజకవర్గాల్లో 3వేల కిలో మీటర్లు సాగనుంది. వైఎస్ఆర్ జిల్లా నుంచి పాదయాత్ర కర్నూలు, అనంతపురం, చిత్తూరు, నెల్లూరు జిల్లాలు మీదగా ఇచ్చాపురం వరకు కొనసాగనుంది. మరోవైపు పాదయాత్రకు సంఘీభావంగా 13 జిల్లాల నుంచి వచ్చిన కార్యకర్తలకు,అభిమానులకు, ప్రజలకు వైఎస్ జగన్ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.